పాముకు పాలుపోసిన కాటే వేస్తుంది.. హేమంత్పై సతీశ్ భార్య ప్రశాంతి
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ మైల హత్య కేసు పూటకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు ప్రియాంక వాళ్ల స్నేహితుడు హేమంత్ హత్య చేశారని అనుకొంటుండగా .. సతీశ్ భార్య ప్రశాంతి మీడియా ముందుకొచ్చారు. సతీశ్పై జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. తన భర్త మంచివారని .. వివాహేతర సంబంధాలను అంటగట్టడంపై మండిపడ్డారు. కేసును మూసివేసేందుకు తెరపైకి ప్రియాంక ఇష్యూను తీసుకొచ్చారని ఆరోపించారు. మీడియా, పోలీసులు ... తన భర్త గురించి చెడుగా ప్రచారం చేయొద్దని చేతులు జోడించి దండం పెట్టి మరీ చెప్పారు.
రోజుకో ట్విస్ట్
సతీశ్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. సతీశ్, హేమంత్ .. ప్రియాంక కోసం గొడవ పడ్డారని .. అందుకే హేమంత్ హతమార్చాడని ప్రచారం జరిగింది. సతీశ్పై మీడియాలో తప్పుడు కథనాలు రావడంతో ఎట్టకేలకు ఆయన భార్య ప్రశాంతి మీడియా ముందుకొచ్చారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు వివాహేతర సంబంధం అంటగడుతున్నారని ఆరోపించారు. తన భర్త మంచివారని పేర్కొన్నారు. అయితే హేమంత్ ఇంటికి వెళ్లేముందు సతీశ్ .. ప్రియాంకను హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ఫుటేజీ ఆధారంగా ప్రియాంకను ప్రశ్నిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలే
సతీశ్ హత్యకు ప్రధాన కారణం .. ఆర్థిక లావాదేవీలేనని అనుమానం వ్యక్తం చేశారు ప్రశాంతి. తన భర్త చనిపోవడానికి వారం రోజుల ముందు నుంచి అతని స్నేహితులు, భాగస్వాములు అయిన హేమంత్, ప్రియాంక, క్రాంతి, సతీశ్ .. వాట్సాప్, కాల్ డేటాను పరిశీలించాలని కోరారు. అప్పుడు మీకు నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తన భర్త హత్యకు హేమంత్, ప్రియాంక, క్రాంతి హస్తం కూడా ఉండొచ్చని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ప్రశాంతి పోలీసులను విన్నవించారు.
సీసీటీవీ ఫుటేజీ ..
ప్రియాంకను హాస్టల్ వద్ద వదిలి .. హేమంత్ వద్దకెళ్లి సతీశ్ .. అక్కడే హత్యకు గురయ్యాడు. ప్రియాంక విషయంలో మాట్లాడేందుకు వెళ్లి చనిపోయిన సంగతి తెలిసిందే. హేమంత్ తెలివిగా .. మందు తాగుదామని పిలిపించి .. హత్యకు తెగబడ్డారని తెలుస్తోంది. హేమంత్ను సతీశ్ చేరదీశాడని ప్రశాంతి చెప్తున్నారు. తమ చేతులతో అన్నం పెడితే .. తమ కడుపుకొట్టారని వాపోయారు. తాము పాముకు పాలు పోశామని నిట్టూర్చారు. హేమంత్ ఇంటికెళ్లిన సతీశ్ తిరిగిరాకుంటే .. అనుమానం హేమంత్ పైనే వస్తుంది కదా అని ప్రశ్నించారు ప్రశాంతి. కానీ పోలీసులు మాత్రం ప్రియంకను విచారిస్తున్నారని తెలిపారు.
వెలుగులోకి వాస్తవాలు
సతీశ్ హత్య కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీశ్ స్నేహితురాలు అని భావించిన ప్రియాంక అతని లవర్ అని .. హేమంత్ కూడా ప్రియాంకతో ప్రేమాయణం నడిపాడని తెలుస్తోంది. వీరిద్దరికీ అమ్మాయి విషయంలోనే గొడవ జరిగిందని సమాచారం. కేపీహెచ్బీలోని సాప్ట్ వేర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న ప్రియాంక అక్కడే పనిచేశారు. తొలుత సతీశ్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే సతీశ్తో ప్రేమాయణం నడిపినట్టు సమాచారం. తర్వాత హేమంత్ లైన్లోకి వచ్చారు. తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. ఇటు హేమంత్ కూడా ప్రియాంక ప్రేమలో మునిగిపోయాడు. ఆమెతో ఉండేందుకు ఆఫీసు దగ్గరలో అపార్ట్ మెంట్ కూడా తీసుకున్నాడు. అయితే వీరిద్దరితో ప్రియాంక ప్రేమిస్తున్నట్టు నటించి .. కాలం వెళ్లదీసింది. తాజాగా సతీశ్తో ప్రియాంక ఉంటోంది. ఈ విషయం తెలిసి .. హేమంత్ రగిలిపోయాడు. ఏం చేయాలా అని వ్యుహరచన రచించాడు. ప్రణాళిక రచించి .. సతీశ్ను తన ఇంటికి పిలిచి ... హతమార్చాడు.