కుప్పకూలిన నాంపల్లి హెరిటేజ్ భవనం సరాయి: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని హెరిటేజ్ భవనం నాంపల్లి సరాయిలోని ఒక భాగం శనివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి.
భవనం సరాయి కూలడంతో అక్కడేవున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన రెండు ప్రత్యేక బృందాలు జేసీబీ, ఇసుజు వాహనంతో కూలిన శిథిలాలను తొలగించే ప్రక్రియను చేపట్టాయి.
దాదాపు వందేళ్ల చరిత్ర గల ఈ నాంపల్లి సరాయి విశ్రాంతి భవనాన్ని ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1919లో 5,828 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, ఇతర అవసరాలకు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చేవారికి కోసం ఈ సరాయిని నిర్మించారు.
కాగా, 2011లో ఈ భవనాన్ని హెరిటేజ్ భవనంగా ప్రకటించారు. నగరంలోని నిరుపేదలకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ఐదు రూపాయల భోజన పథకం మొదటి కేంద్రాన్ని ఈ నాంపల్లి సరాయిలోనే ప్రారంభించారు. ఈ కూలిన భవన స్థలం వద్దనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ శిథిలాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ సరాయి భవనాన్ని ఆనుకొని ఉన్న ఇతర భవనాలు కూడా పురాతనమైనవే కావడంతో అవి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ శిథిలాలను తొలగిస్తున్నారు.