వాజీ..వాజీ.. వాజీ.. నువ్వు పడకపోతీవి రాజీ..! నగరం నుంచి వెళ్లి పోతివా శివాజీ...!!
హైదరాబాద్ : ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే..! సమైఖ్యాంధ్ర నినాదం, ఆపరేషన్ గరుడ, ఓ న్యూస్ ఛానల్ షేర్ల కొనుగోలు.. ఈ మూడు పేర్లు వినగానే గుర్తొచ్చేది యాక్టర్ శివాజీ. ఒకప్పటి టీవి యాంకర్.. సహనటుడు. హీరో మూడు పాత్రల్లో తనను తాను నిరూపించుకున్న శివాజీ.. రాజకీయంగా కూడా ఎదగాలనుకున్నాడు. కానీ.. అక్కడ ఎత్తులు. పై ఎత్తులు గుర్తించలేక బొక్కబోర్లాపడ్డాడు. తాను అన్ని పార్టీలను .. అందరి నేతలను విమర్శిస్తానంటూనే.. చంద్రబాబు అనుచరుడిగా.. వైసీపీ, జనసేనను తిట్టేందుకు కుడిభుజంగా మారాడనే అపవాదును మూటగట్టుకున్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమ ఫలితం..! హీరో శివాజీ నుండి గరుడు శివాజీ వరకు ప్రస్థానం..!!
అదే రాజకీయ క్రీడలో బలిపశువుగా మారాడు. ఆటలో అరటిపండు అనేంత కిందకు దిగజారాడు. దీనంతటికీ కారణం.. నరేంద్రమోదీతో చంద్రబాబు వైరం నాటి నుంచి మొదలైంది. అప్పటికే ప్రత్యేకహోదాపై ఉద్యమం చేపట్టిన శివాజీ అప్పటికే మేధావిగా పేరుపడిన చలసాని శ్రీనివాస్ పక్కకు చేరాడు. అయితే.. అప్పటికే బీజేపీ ఏపీకు ఏదో నష్టం చేస్తుందనే ఊహాగానాలు.. లెక్కలు.. గణాంకాలతో ఆపరేషన్ గరుడ అని తెరమీదకు కొత్త వివాదం తీసుకువచ్చారు శివాజి. అప్పటినుండి ఆయనను హీరో శివాజీ అనకుండా గరుడ శివాజీ అని పిలవడం మొదలెట్టారు జనాలు.
ఎంతో పేరు తెచ్చిన ఛానల్..! ఇప్పుడు అదే ఛానల్ గుదిబండగా మారింది..!!
జగన్పై దాడి జరగబోతుందనే వార్తను ముందుగానే ఉప్పందించాడు. ఆ క్రమంలోనే జగన్పై నిజంగానే హత్యాయత్నం జరగటంతో శివాజీను విచారించేందుకు పోలీసులు, ఎన్ ఐఏ వర్గాలు సిద్ధమయ్యాయి. దీంతో అతడు కొద్దిరోజుల విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ కొలిక్కి వచ్చి ఎన్నికలు ముగియటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శివాజీ ప్రతి కదలికలను హైలెట్ చేసేందుకు టీవీ9 నడుం బిగించింది. దీనివెనుక అసలు రహస్యం ఏమిటనేది ఆరాతీస్తే.. టీవీ9లో శివాజీకు షేర్లు ఉన్నాయనేది తేలింది. ఇదే ఇప్పుడు శివాజీ మెడకు ఉచ్చులా చుట్టుకుంది.
షేర్ల కేసులో శివాజీ..! ఇంకా వెలుగులోకి రాని హోదా సారథి..!!
టీవీ9 యాజమాన్యం మారినా.. రవిప్రకాష్ సంతకాల ఉదంతాలు ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు. ఇది కాస్త పోలీసుల వరకూ చేరటంతో కేసు విచారణ మొదలైంది. మొదటిరోజు తాను పరారీలో లేనంటూ చెప్పిన రవిప్రకాష్ పోలీసుల నోటీసులతో సెల్ఫోన్లు స్విఛాఫ్ చేశారు. అండర్గ్రౌండ్లోకి వెళ్లారంటున్నారు. ఈ తలనొప్పులు.. చికాకులు.. ఇద్దరు పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో శివాజీ హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రశేఖర్ రావు సర్కారుతో మున్ముందు ఇబ్బందులు తప్పవంటూ పలుమార్లు తన సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ గరుడ పేరుతో అందరి భవితవ్యం చెప్పిన శివాజీ..! నగరం దాటి వెళ్లి పోతున్న కథానాయకుడు..!!
ప్రస్తుతం టీవీ9 కేసులో శివాజీ ఫిర్యాదు కీలకం కానుంది. తనకు షేర్లు అమ్మిన రవిప్రకాష్ వాటిని ఇవ్వకుండా తనను మోసం చేశాడనేది శివాజీ ఫిర్యాదు. ఇప్పుడు తన మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో అరెస్టుకు అవకాశాలున్నాయి. మరోవైపు ఏపీలో జగన్ సీఎం అయితే అక్కడా చికాకులు చవిచూడాల్సి వస్తుందనే భయం కూడా లోలోన ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని ఇంటిని అమ్మేసినట్టు ప్రచారం సాగుతుంది. మరి ఏపీలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమిస్తారనేది వేచిచూడాలి.