తమిళిసై ముందే వచ్చారు: కేబినెట్ విస్తరణ వద్దన్నారు: ఇటు కేసీఆర్..అటు కేంద్రం..హైడ్రామా..!
తెలంగాణ కేబినెట్ విస్తరణ విషయంలో ఏం జరిగింది. వెళ్లిన గవర్నర్ నరసింహన్ తో చేుయించాలని భావించిన కార్యక్రమం ఎందుకు వాయిదా పడింది. కొత్తగా వచ్చిన గవర్నర్ మంత్రుల ప్రమాణ స్వీకారం పైన ఏం చెప్పారు. కేసీఆర్ ఎటువంటి మంత్రాంగం నడిపారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ వాస్తవంగా నరసింహన్ ద్వారా చేయించాలని ముఖ్యమంత్రి భావించారు. అయితే, తొలుత 11వ తేదీన కొత్త గవర్నర్ కు అవకాశం ఇస్తూ తాను దిగిపోవాలని నరసింహన్ భావించారు. కానీ, కొత్త గవర్నర్ ముందే రావాలని నిర్ణయించారు. దీంతో..కేబినెట్ విస్తరణ సైతం మారింది. కొత్త గవర్నర్ తాను వచ్చిన రోజే విస్తరణ వద్దని సూచించారు. కానీ, ముఖ్యమంత్రి ఎట్టకేలకు ఒప్పించారు. చివరకు కేంద్రం జోక్యంతో తాను అనుకున్న ముహూర్తానికి కేసీఆర్ కొత్త గవర్నర్ తోనే కేబినెట్ విస్తరణ పూర్తి చేసారు.
సీఎం కేసీఆర్ కు సవాల్ గా :పెరుగుతున్న అసంతృప్తులు: తాజాగా మాజీ మంత్రులు..!!
కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హైడ్రామా..!!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1న కేంద్ర ప్రభుత్వం నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందర రాజన్ను నియమించింది. ఆగస్టు 31 రాత్రే సీఎం కేసీఆర్కు కొత్త గవర్నర్ వస్తున్నారన్న సమాచారం అందింది. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అప్పటికి నెల రోజుల ముందే కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ముహూర్తాల కోసం పండితుల అభిప్రాయం సేకరించారు. సెప్టెంబరు 8న దశమి రోజు మంచి ముహూర్తం ఉండటంతో అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో గవర్నర్ మార్పు నిర్ణయం వెలువడింది. సెప్టెంబరు ఎనిమిదిన నరసింహన్తో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిచేసి, పదో తేదీన ప్రగతిభవన్లో ఘనంగా విందు ఇచ్చి వీడ్కోలు తెలపాలని తొలుత సీఎం భావించారు. నరసింహన్ కూడా 11న శుభదినం కావడంతో ఆ రోజున రాజ్భవన్ను వీడాలని నిర్ణయించి... అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు సమాచారం. ఇంతలో కొత్త గవర్నర్ తమిళిసై సెప్టెంబరు 8న బాధ్యతలు స్వీకరిస్తానని సమాచారం అందించారు. దాంతో ముఖ్యమంత్రి చొరవ తీసుకొని నరసింహన్ 11 వరకు ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం అందించారు.
కానీ..ముందుగానే తమిళి సై వచ్చేసారు..
ఇలా సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే ఏమయిందో ఏమో కానీ 8నే తాను రాష్ట్రానికి వస్తున్నట్లు రాజ్భవన్కు సమాచారం అందించారు. దాంతో 7వ తేదీనే నరసింహన్ రాజ్భవన్ను అనివార్యంగా వీడాల్సి వచ్చింది. ఏడునే గవర్నర్కు విందు ఏర్పాటు చేశారు. నిజానికి సప్తమి రోజు కూడా ప్రమాణ స్వీకారానికి మంచిరోజేనని పండితులు సూచించడంతో ఐదో తేదీనే ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని సీఎం భావించినట్లు చెబుతున్నారు. అయితే, కొత్త గవర్నర్ వస్తుండగా, దిగిపోతున్న గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించడం సరికాదని కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో ఆగిపోయినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రమాణ స్వీకారం చేసిన రోజే మంత్రివర్గ విస్తరణ వద్దని తమిళిసై స్పష్టం చేసినట్లు సమాచారం. బాధ్యతలు స్వీకరించిన రోజే ఎందుకు... కొన్ని రోజులు ఆగవచ్చు కదా అని ఆమె పట్టుబట్టడంతో... చేసేదేమీ లేక ఢిల్లీలోని బీజేపీ పెద్దలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో తమిళిసై సరేనన్నట్లు సమాచారం. తాజాగా గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన తమిళిసై పూర్తిస్థాయి బీజేపీ కార్యకర్త కావడం, మొండిమనిషిగా ఆమెకు పేరుండటంతో సీఎం-గవర్నర్ సంబంధాలు అంత సాఫీగా ఉండవని మొదటి నుంచే ఊహిస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆమె తన మొండి తనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తొలిరోజే చూపించారు. ఆమె 8నే ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం వెనుక తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను అడ్డుకోవడానికి, తాత్కాలికంగా వాయిదా వేయించడానికి ఆయన అన్ని విధాలా చివరిదాకా ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది.
మాట నెగ్గించుకున్న గవర్నర్..
మాజీ గవర్నర్ నరసింహన్ 11వ తేదీన హైదరాబాద్ వీడాలని భావిస్తున్నారని సమాచారం ఇచ్చినా..తొలుత సరే అంటూనే తిరిగి 8వ తేదీనే గవర్నర్ గా రావాలని తమిళ సై నిర్ణయించటం ద్వారా తన విధానం ఏంటో గవర్నర్ చెప్పకనే చెప్పారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. అయితే, కేసీఆర్ సైతం తన చతురతో కేంద్రం ద్వారా కొత్త గవర్నర్ ను తాను నిర్ణయించిన ముహూర్తానికి కేబినెట్ విస్తరణ జరిగేలా ఒప్పించటంలో సక్సెస్ అయ్యారు. అయితే, గతం కంటే భిన్నంగా మాత్రం రాజకీయ పరిస్థితులు తెలంగాణలో మారే అవకాశం కనిపిస్తోంది.