చెప్పండి, ఐలయ్యపై సీబీఐ దర్యాప్తు చేయవచ్చా?: ఆర్యవైశ్య పిటిషన్పై హైకోర్టు
ఇటువంటి సంఘటనల్లో సీబీఐ దర్యాప్తు చేయవచ్చా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించారు.
హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. అటు ఆర్యవైశ్యులంతా ఐలయ్యను శిక్షించాల్సిందేనని పట్టుబడుతుండగా.. ఇటు బహుజనులంతా ఐలయ్యను కాపాడుకుందాం అన్న నినాదంతో ముందుకెళ్తున్న పరిస్థితి.
ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..
ఈ నేపథ్యంలో ఐలయ్యను చట్ట పరిధిలో శిక్షించడానికి ఆర్యవైశ్యులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ఐలయ్య అక్రమంగా నిధులు పొందుతూ, పుస్తకాల రూపంలో హిందుత్వంపై దాడికి పాల్పతున్నారని, ఆయన తీరుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
సీబీఐ దర్యాప్తు చేయవచ్చా?:
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొఫెసర్గా ఉన్న ఐలయ్య సామాజిక బాధ్యతను విస్మరించి రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు.
రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి కోదండరాం.. ఓ సందేహాన్ని లేవనెత్తారు. ఇటువంటి సంఘటనల్లో సీబీఐ దర్యాప్తు చేయవచ్చా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించారు. విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు.
Recommended Video
వత్సల పిటిషన్పై విచారణ వాయిదా:
కంచ ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా పెద్దగొల్లపల్లికి చెందిన వత్సల దాఖలు చేసిన పిటిషన్పై విచారణను న్యాయమూర్తి 12వ తేదీకి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై అభిప్రాయాన్ని తెలియజేయాలని పోలీసులను ఆదేశించారు.
డీజీపీకి ఫిర్యాదు:
వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్న కంచ ఐలయ్య వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల డీజీపీ అనురాగ్శర్మకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మంగళవారం డీజీపీ కార్యాలయంలో మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాశెట్టి పాండు గుప్తా నేతృత్వంలో ఆర్యవైశ్య ప్రతినిధులు అనురాగ్శర్మను కలిశారు. ఆయన ఒక సామాజిక ఉగ్రవాది అని, ఆయనకు విదేశీ సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఆర్యవైశ్యుల పాదయాత్ర:
కంచ ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన పుస్తకాన్ని నిషేధించాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా డిమాండ్ చేశారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంగళవారం వర్గల్, ములుగులో ఆయన మాట్లాడారు.
ఆర్యవైశ్యుల డిమాండ్ల పరిష్కారంతోపాటు వైశ్య కార్పొరేషన్ను సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు మేఘమాల, యూత్ విభాగం అధ్యక్షుడు రాజేందర్ గుప్తా, బచ్చు శ్రీనివాస్, రఘు గంగిశెట్టి పాల్గొన్నారు.
రెండుగా చీలిన ఆర్యవైశ్య పాదయాత్ర:
ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర రెండు బృందాలుగా చీలిపోయింది. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి (ఐసీపీఎస్) అధ్యక్షుడు ప్రేమ్కుమార్ గాంధీ ఆధ్వర్యంలో ఓ బృందం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) ఆధ్వర్యంలో మరో బృందంగా విడిపోయింది.
గజ్వేల్లో వీరి పాదయాత్రకు సరైన అనుమతులు లేవంటూ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వర కు వారిని గృహ నిర్బంధం చేశారు. అనంతరం రెండు బృందాలు అనుమతి తెచ్చుకొని పాదయాత్రను కొనసాగించాయి.