ఉగ్రవాదుల టార్గెట్గా హైదరాబాద్, బెంగళూరు: బయటపడ్డ ఆందోళనకర విషయాలు..
లష్కరే తోయిబా టార్గెట్ లో హైదరాబాద్, బెంగుళూరు నగరాలు ముందు వరుసలో ఉన్నట్లు గుర్తించారు. ఐటీ సంస్థలతో పాటు, మాల్స్ టార్గెట్ గా ఈ విధ్వంసం జరపడానికి ప్లాన్ చేసినట్లు రషీద్ కూడా అంగీకరించాడు.
హైదరాబాద్: ముష్కర మూకలు మరోసారి అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో భద్రతను పెంచారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలను టార్గెట్ గా చేసుకుని వారు దాడులకు దిగవచ్చునన్న సమాచారంతో ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.
ఈ నెలాఖరు వరకు నగరంలో భద్రతను కట్టుదిట్టడం చేయడంతో.. అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీస్ విభాగానికి సూచించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల టార్గెట్ ఐటీ జోన్ గా తెలుస్తుండటంతొ.. మాదాపూర్,హైటెక్ సిటీ పరిధిలోని పలు మాల్స్ వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
ఎలా తెలిసింది?:
జమ్మూ కశ్మీర్ లోని పోలీస్ పికెట్ పై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో.. రషీద్ అనే సూత్రధారిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతన నెల 7వ తేదీన ఈ దాడి జరగ్గా.. 13న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆపై విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఆదేశాల మేరకే రషీద్ ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్దారించారు. అంతేకాదు, లష్కరే తోయిబా టార్గెట్ లో హైదరాబాద్, బెంగుళూరు నగరాలు ముందు వరుసలో ఉన్నట్లు గుర్తించారు. ఐటీ సంస్థలతో పాటు, మాల్స్ టార్గెట్ గా ఈ విధ్వంసం జరపడానికి ప్లాన్ చేసినట్లు రషీద్ కూడా అంగీకరించాడు.
రషీద్ విచారణలో తేలిన అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర నిఘా విభాగ సంస్థ హైదరాబాద్ పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేసింది. నెలాఖరు వరకు, ముఖ్యంగా వీకెండ్స్ సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా సూచించింది.
మాల్స్లో తనిఖీలు:
ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో ఐటీ కారిడార్ లోని ఇనార్బిట్ మాల్ సహా పలు మాల్స్ ను పోలీసులు తనిఖీ చేశారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించి.. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే మాల్ లోకి అనుమతించడం గమనార్హం.