టీపీసీసీ చీఫ్ కావాలంటే ఆ టాస్క్ చెయ్యాలని చెప్పిన హై కమాండ్..రేవంత్ తో అది సాధ్యమా ?
Recommended Video
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వనున్నారని కాంగ్రెస్ పార్టీలో దుమారం లేచింది.ఇక వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలకు టిపిసిసి చీఫ్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అంతేకాదు రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ గా అవకాశం ఇస్తే చాలామంది సీనియర్ నేతలు పార్టీని వీడి వెళతారని హెచ్చరికలు సైతం జారీ చేశారు.ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీపీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ రెడ్డికి ఒక టాస్క్ అప్పజెప్పింది. ఆ టాస్క్ లో రేవంత్ సక్సెస్ అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తామని తేల్చి చెప్పింది హై కమాండ్.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావించిన హై కమాండ్
తెలంగాణా కాంగ్రెస్ లో చాప కింద నీరులా టీపీసీసీ చీఫ్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు . ఇక టీపీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణా గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కుదేలు అయిన నేపథ్యంలో పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడు కోసం హైకమాండ్ అన్వేషణ ప్రారంభించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొనే నాయకుడు ఎవరు అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిపిన హై కమాండ్ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ధీటుగా ఎదుర్కొంటారని పార్టీని బలోపేతం చేస్తారని భావించింది.
రేవంత్ కు టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తే ఊరుకోమని కాంగ్రెస్ సీనియర్ నేతల నిరసన
అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అవకాశమిస్తే ఊరుకోబోమని పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను కాదని రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వటం ఏంటి అని గట్టిగానే ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.ఇక విహెచ్ బాహాటంగా రేవంత్ రెడ్డి పై విరుచుకు పడ్డాడు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖాయమనే వార్తలు రావటంతో రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ తో కలిసి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కూడా కలిసి వచ్చారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు. దీనితో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విషయంలో కొంచెం వెనక్కి తగ్గిందని సమాచారం .
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించిన సీనియర్లు
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో మొదటినుంచి ఐక్యత లేదు . ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని సీనియర్లు హెచ్చరించటంతో కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించాలంటే ముందుగా పార్టీలోని నాయకులు అందర్నీ ఏక తాటి మీదికి తీసుకురావాలని హై కమాండ్ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. పార్టీలోని సీనియర్ నేతలను ఒప్పించి, వాళ్ళ పూర్తి అంగీకారంతో వస్తే నీకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది.
అందరినీ ఏకతాటిమీదకు తేవాలని టాస్క్ అప్పగించిన అధిష్టానం .. రేవంత్ సక్సెస్ అవుతారా ?
పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో అయినా పార్టీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుంది . అలా కాకుండా ఇలా వర్గాలుగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుంది అని భావించిన హై కమాండ్ అదే విషయాన్ని రేవంత్ కు చెప్పింది. నీ విషయంలో అందరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసుకోవటం నీ బాధ్యత. కాబట్టి సీనియర్లతో మంతనాలు జరిపి అంగీకారంతో ఈ విషయంపై ఒక క్లారిటీ తో రావాలని రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలను ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. కానీ తలపండిన మేధావులున్న కాంగ్రెస్ పార్టీలో అందరి ఏకాభిప్రాయం సాధ్యమేనా, రేవంత్ ఈ టాస్క్ లో సక్సెస్ అవుతారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న .