ఓటురు జాబితాలో తప్పులుంటే ఫిర్యాదు చేయండి: శశిధర్ రెడ్డికి హైకోర్టు
హైదరాబాద్: ఓటరు జాబితా సవరణ.. చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఓటరు జాబితా సవరణ వివరాలతో పాటు దానికి సంబంధించిన విధి విధానాలను ఈసీ శుక్రవారం హైకోర్టుకు సమర్పించింది.
సవరించిన జాబితా చట్టబద్ధంగా లేకపోతే తమకు ఫిర్యాదు చేయవచ్చనని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డికి హైకోర్టు సూచించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసింది. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలకు సంబంధించిన వ్యాజ్యంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది.
ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఇటీవల షెడ్యూలు సవరణ జరిగిందని.. కాబట్టి తెలంగాణలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరం లేదని ఈసీ వెల్లడించింది.
ఎన్నికల సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలపడం వెనక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని, ఈసీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. అయితే దీనిపై తదుపరి విచారణ దసరా సెలవుల తర్వాత చేపడతామని హైకోర్టు వెల్లడించింది.