తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం: కరోనా లెక్కలపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం
హైదరాబాద్: కరోనా కేసులు, మరణాల విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది.
వాస్తవాలు వెల్లడించండి...
రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించడం లేదనిపిస్తోందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 మాత్రమే ఉండటం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. అంతేగాక, కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.
జిల్లాల లెక్కలేవీ?
జిల్లాల్లో కరోనా వైద్య సదుపాయాలు పెంచాలని, జిల్లా స్థాయి బులెటిన్ల విడుదలపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారని పేర్కొంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు జిల్లా బులెటిన్లు సమర్పించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీలో ఐసోలేషన్, కరోనా కేంద్రాల వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. జిల్లాల నుంచి కరోనా బాధితులు హైదరాబాద్ వచ్చేందుకు అంబులెన్సులు పెంచాలని ఆదేశించింది.
ప్రైవేటు ఆస్పత్రుల సంగతేంటి?
నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు చట్టానికి అతీతమా? అని ప్రశ్నించింది. రాయితీలు తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రజలకు సేవచేసే బాధ్యత లేదా? అని నిలదీసింది. ప్రైవేటు ఆస్పత్రులపై విచారణ జరిపి సెప్టెంబర్ 22లోగా నివేదిక అందజేయాలని జాతీయ ఫార్మా సంస్థను ఆదేశించింది. ఆ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీహెచ్ డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. అంతేగాక, ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వు చేస్తామన్న మంత్రి హామీ ఎందుకు అమలుకాలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సగం పడకలు రిజర్వు చేస్తారా? లేదా? అనేది తెలపాలని.. ఒకవేళ రిజర్వు చేయొద్దని నిర్ణయిస్తే కారణాలు వెల్లడించాలని పేర్కొంది.
పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి.. లేదంటే..
ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే ల్యాబ్ల సంఖ్య పెంచాలని స్పష్టం చేసింది. కరోనాకు ముందు.. ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన బడ్జెట్ వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వీధుల్లో నివసించేవారికి మొబైల్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ ప్రణాళికలను సెప్టెంబర్ 22 లోపు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తప్పుడు నివేదికలు సమర్పిస్తే చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది.