తెలంగాణలో లో మరో ఎన్నికల పోరు: మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: స్టే ఎత్తివేత..!
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమవుతోంది. చాలా రోజులుగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన హైకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వీటి పైన దాదాపు ఆరు నెలలకు పైగా విచారణ సాగుతోంది. అయితే, హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటీషన్లను గత నెలలో కొట్టివేసిన హైకోర్టు.. తాజాగా 73 మున్సిపాల్టీల పైన గతంలో ఇచ్చిన స్టే ఎత్తి వేస్తూ ..మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
ఓటర్లు లిస్టులో అక్రమాలు.. వార్డుల విభజన..రిజర్వేషన్ల అంశాల పైన హైకోర్టు ముందు వాదనలు జరిగాయి. వీటిల్లో సవరణల కోసం 14 రోజుల సమయం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో..ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం సిద్దంగా ఉన్న ప్రభుత్వం ఇక దీని పైన నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో తగ్గిన అవినీతి..దేశంలో 13వ స్థానంలో: 5వ స్థానంలో తెలంగాణ: తాజా సర్వేలో ఆసక్తి కరంగా..!
మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
హైకోర్టులో మున్సిపల్ ఎన్నికల విషయంలో కీలక తీర్పు వెలువడింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను తమ అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అనేక పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటి మీద సుదీర్ఘంగా చర్చలు..వాదనలు సాగాయి. అయితే, వాటన్నింటినీ హైకోర్టు కొట్టివేస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణలోని మొత్తం 128 మున్సిపాల్టీలు..13 కార్పోరేషన్లు ఉన్నాయి.అందులో 75 మున్సిపాల్టీలకు సంబంధించి గతంలో కోర్టు స్టే ఇచ్చంది. గతంలో 73 మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణ కోసం స్టే వెకేట్ అయింది. మిగిలిన 53 మున్సిపాల్టీలకు మాత్రం హైకోర్టు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గత నెలలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేత..
గత నెలలో హైకోర్టు 53 మున్సిపాల్టీలలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 73 మున్సిపాల్టీల విషయంలో మాత్రం స్టే తొలిగిస్తేనే ఎన్నికలు సాధ్యం అవుతుందని స్పష్టం చేసింది. దీంతో..ప్రభుత్వం ఆ దిశగా న్యాయ పరమైన చర్యలు కొనసాగించింది.. స్టే తొలిగించిన తరువాత మొత్తంగా 128 మున్సిపాల్టీలకు కలిసి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కొన్ని నగర పంచాయితీలను ప్రభుత్వం మున్సిపాల్టీలుగా అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రిజర్వేషన్లు..ఓటర్ల లిస్టులో అక్రమాలు.. వార్డుల విభజన పైన కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఇక, ఇప్పుడు హైకోర్టు తాజాగా ఆ 73 మున్సిపాల్టీలపైన గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో హైకోర్టు నుండి కొన్ని కీలక సూచనలు జారీ అయ్యాయి.
14 రోజుల్లో సవరణలు పూర్తి చేయాలి
తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ 73 మున్సిపాల్టీల్లో వార్డుల విభజన..ఓటర్ల సవరణ..రిజర్వేషన్ల పైన తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. వీటి పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల్లో సంబంధిత కమిషనర్ వద్ద ఫిర్యాదు చేసుకొనే వెసులుబాటు కలిగిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో..ప్రభుత్వం వెంటనే ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తాము కోర్టు తీర్పు కోసం చూస్తున్నామని..తీర్పు వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేసారు. ఇక, న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోవటంతో.. డిసెంబర్ 15 నాటికి తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.