వృద్దుల ఆదాయాన్ని అడ్డుకోవడం సమంజసమా..?పెన్షనర్ల అంశంలో టీ సర్కర్ ను తప్పుబట్టిన హైకోర్ట్.!
హైదరాబాద్ : పెన్షనర్ల అంశంలో తెలంగాణ హైకోర్ట్ టీ సర్కార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోతపై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ చట్టం ప్రకారం ఫించనులో కోత విధించారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. వేతనాలు, ఫింఛన్ల కోతపై ఆర్డినెన్స్ జారీ చేసినట్టు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం వివరించింది. ఆర్డినెన్స్ వివరాలు పిటిషనర్లకు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులకు తెలిపింది. ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ న్యాయవాది పిటిషన్ సవరణకు అనుమతిని కోరారు. పిటిషన్లపై విచారణ ఈనెల 24కి హైకోర్ట్ వాయిదా వేసింది.
పెన్షనర్లపై ఎందుకంత కఠినం.. వారి ఆదాయాన్ని ఎలా నిలువరిస్తారని టీ సర్కార్ కు హైకోర్ట్ ప్రశ్న..
ప్రభుత్వం తీసుకున్న వ్యవస్థాపరమైన నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పు పట్టటం సర్వ సాధారణం. ప్రతి అంశాల్లో కాకున్నా, అప్పుడప్పుడు ప్రసాభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటాయి. హైకోర్ట్ ఇస్తున్న ఇలాంటి తీర్పులపై ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. అంతే కాకుండా కోర్టు తప్పు పట్టిన అంశాలపై తమ తీరును మార్చుకోవటం, అందుకు సంబందించి న్యాయస్ధానాలను కొంత సమయం కోరడం కూడ సర్వసాదారణంగా జరిగిపోయే ప్రక్రియ. తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించి కొత్త చర్చకు తెర తీశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
ఆర్డినెన్స్ నిర్ణయంతో వృద్దులు ఇబ్బంది పడరా..? ప్రభుత్వం తీరు మార్చుకోవాలన్న న్యాయస్థానం..
రెండు రోజుల క్రితం పెన్షనర్లకు కోత విధిస్తూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. వయసు మళ్లిన తర్వాత వారికి వచ్చే ఆదాయ మార్గాన్ని అడ్డుకోవటంలో అర్థమేమిటని సూటిగా ప్రశ్నించినంత పని చేసింది న్యాయస్థానం. ఇదే కోణంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆక్షింతలు కూడా వేసింది. వృద్దులు, వారికి అందుతున్న అరకొర ఆదాయం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలన్న సూచన చేసి కోర్ట్ విచారణను వాయిదా వేసింది.
కోర్ట్ అడిగే ప్రశ్నలనుండి బయటపడేందుకే ఆర్డినెన్స్..తప్పుబడుతున్న ఉద్యోగ సంఘాలు..
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గట్టుగా ఎవ్వరూ ఊహించని విధంగా గత మంగళవారం రాత్రి చంద్రశేఖర్ రావు సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆదాయం తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో కోత విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేలా ఆర్డినెన్స్ ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు వ్యాఖ్యలకు సమాధానం అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.
Recommended Video
అనుకోని విపత్తు సంభవించినప్పుడు కోత విధిస్తే తప్పులేదు.. తన వాదన వినిపిస్తున్న ప్రభుత్వం..
అందులో భాగంగా రాష్ట్రంలో ఏదైనా అనుకోని విపత్తు లేదా ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితి చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వం నుండి ఆదాయం పొందుతున్న ఏ వ్యక్తికైనా లేదా ఏ సంస్థకైనా, పెన్షనర్లకు చెల్లింపులు వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెబుతూ ఆర్డినెన్సును తీసుకొచ్చింది టీ సర్కర్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు ఎలా ఇస్తుందన్నది ఇప్పడు ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా గులాబీ ప్రభుత్వం రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తీసుకురావటంపై టీఎస్ యూటీఎఫ్ ఖండిస్తోంది.