ఆర్టీసీ సమ్మె కేసు 10వ తేదీకి వాయిదా: వాస్తవ పరిస్థితి కోరిన హైకోర్టు: ఇక ప్రభుత్వం చేతిలో నిర్ణయం..
తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం పైన హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని ఓయూ విద్యార్థి సుదేంద్ర సింగ్ దాఖలు చేశారు. దీనిపై కుందన్బాగ్లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో విచారణ కొనసాగింది. పండుగ రోజుల్లో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..సమ్మె విరమించాల్సిందిగా ఆదేశించాలని పిటీషనర్ హైకోర్టును అభ్యర్ధించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీని విస్మరించడంతోనే కార్మికులు సమ్మె చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
సమ్మె వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ..తద్వారా సమ్మె విరమణ దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీని పైన ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని..ఇతరత్రా ఏర్పాట్లతో ప్రజలను రవాణా సదుపాయం కల్పిస్తున్నామని కోర్టుకు నివేదించారు. దీంతో..కోర్టు తెలంగాణలోని అన్ని డిపోల వారీగా వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ఈ నెల 10వ తేదీలోగా కోర్టుకు నివేదించాలని ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసింది.
కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ తీర్పు కోసం ప్రభుత్వ ఎదురు చూస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసి సమ్మె..ప్రస్తుత పరిస్థితి పైన మంత్రులు..అధికారులతో సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైన ఆరా తీసారు. ప్రగతి భవన్ కేంద్రంగా ఆర్టీసి సమ్మె ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్న సమయంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. దీంతో..కొద్ది సేపటి క్రితం దీని పైన హైకోర్టు న్యాయమూర్తి ఇటు పిటీషనర్ తో పాటుగా అటు ప్రభుత్వ వాదనలు విన్నారు.
సమ్మె చట్ట బద్దం కాదని వాదిస్తూనే.. సమ్మె కారణంగా ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అయితే.. సమ్మె ముగిసిన తరువాత అర్టీసీ కార్మికులు..ప్రభుత్వం యధావిధిగా ఉంటాయని కానీ..ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఎవరు బాధ్యులని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీంతో.. పూర్తి సమాచారంతో ఈ నెల 10వ తేదీన హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. సమ్మె పై మాత్రం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరుగుతున్న ఉన్నత స్థాయి సమీక్షలో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే ఆసక్తి మొదలైంది.