ఔట్లుక్ కేసు: స్మితా సబర్వాల్కు హైకోర్టులో షాక్, అగ్రిగోల్డ్ చైర్మన్ అరెస్ట్పై ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సబర్వాల్ వ్యవహారంలో ఔట్లుక్పై కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది. స్మితా పరువుకు నష్టం కలిగించారని ఆమె భర్త అకున్ సబర్వాల్ ఫిర్యాదు మేరకు గతంలో సిసిఎస్ పోలీసులు ఔట్లుక్ పైన కేసు నమోదు చేశారు.
కాగా, స్మితా సబర్వాల్ పైన ఔట్ లుక్ మేగజైన్ ప్రచురించిన కథనం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీని పైన పలు కేసులు నమోదయ్యాయి. ఈ అంశంలో స్మితాకు న్యాయ సాయం అందించే నిమిత్తం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది.
ఔట్ లుక్ పత్రిక గ్రూపు అధ్యక్షుడు ఇంద్రనీల్ రాయ్, ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ మాధవి తాత, కార్టూనిస్టు సాహిల్తో పాటు పలువురిపై కేసు నమోదయింది.
స్మితా సబర్వాల్ ప్రతిష్టను దిగజార్చేలా కథనం, కార్టూన్ ప్రచురించారంటూ ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ ఏడాది జూలై 5న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పైన కేసును కొట్టివేయాలని పత్రికా ప్రతినిధులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హైకోర్టు అకున్ పిటిషన్ కొట్టివేసింది.
అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ
అగ్రిగోల్డ్ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. మూడు సంస్థలకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం బాధ్యతలను అప్పగించినట్లు కమిటీ ఉన్నతన్యాయస్థానానికి తెలిరింది. మొదటి విడతలో ఒక్కో సంస్థకు రెండు ఆస్తుల వేలం బాధ్యతలు అప్పగించినట్లు కమిటీ వెల్లడించింది.
కమిటీ నిర్ణయాలను హైకోర్టు ఆమోదించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా పడింది. ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్నాటకల్లో ఉన్న ఆరు ఆస్తులను మూడు సంస్థల ద్వారా అమ్మనున్నారు. ఒక్కో సంస్థకు రెండు ప్రాపర్టీల అమ్మకపు బాధ్యతను ఇస్తున్నారు. కాగా, విచారణ సందర్భంగా హైకోర్టు... అగ్రిగోల్డ్ చైర్మన్ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.