'సస్పెన్షన్'పై రోజాకు సస్పెన్స్!: కొనాలంటే భయం: హైకోర్టు అసహనం
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా సస్పెన్షన్ అంశం పైన విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే పైన రోజా సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు రోజా పిటిషన్ను విచారణకు స్వీకరించింది. సోమవారం దీనిపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. తన పిటిషన్ పైన విచారణకు రోజా మరిన్ని రోజులు ఆగాల్సి వస్తోంది.
జన్మదిన వేడుకలకు హోర్డింగులు అవసరమా: హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ నగరంలో అక్రమ హోర్డింగ్ల ఏర్పాటు పైన హైకోర్టు సోమవారం నాడు అసహనం వ్యక్తం చేసింది. అక్రమ హోర్డింగ్లపై దాఖలైన వ్యాజ్యంపై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. చిన్నచిన్న కార్యక్రమాలకు, జన్మదిన వేడుకలకు కూడా హోర్డింగ్లు అవసరమా అని జిహెచ్ఎంసి అధికారుల్ని ప్రశ్నించింది.
నగరంలో అక్రమ హోర్డింగ్లు లేవంటూ జిహెచ్ఎంసి అధికారులు వివరణ ఇచ్చారు. ఆ వివరణ నమ్మశక్యంగా లేదని హైకోర్టు చెప్పింది.
మరోవైపు, పండ్ల అంశం పైన కూడా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మార్కెట్లో పండ్లు కొనాలంటే భయంగా ఉందని వ్యాఖ్యానించింది. తెలుగు రాష్ట్రాల్లో రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మాగబెట్టడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇథిలిన్తో కాయలను మాగబెట్టే కేంద్రాలను నిర్ణీత కాలంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సూచించింది. హైకోర్టు సూచనలను అమలు చేసేందుకు సిద్ధంగా రెండు ప్రభుత్వాలు తెలిపాయి.