తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం: నివేదిక సమర్పించాలని ఆదేశం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఇసుక మాఫియాపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇసుక రీచ్ల కేటాయింపు కేసులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదిపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది.
హైకోర్డులో ఉండి కూడా అడ్వకేట్ జనరల్కు సరైన సమాచారం ఇవ్వలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు పంపింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
అలాగే, మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలను ఎలా నిరోధిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఇసుక అక్రమ తవ్వకాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు తెలపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
కాగా, ఇసుకను తరలిస్తున్న వాహనాలను జప్తు చేసి జరిమానా విధిస్తున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. జరిమానా కట్టిన తర్వాత స్థానిక కోర్టు నుంచి వాహనాలను తిరిగి తీసుకుంటున్నారని తెలిపింది.
స్థానిక కోర్టుల తీర్పులను తమకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక కోర్టుల తీర్పులను పరిశీలించి మార్గదర్శకాలు ఇస్తామని కోర్టు పేర్కొంది.
ఏసీబీ వలలో విద్యుత్ జేఏఓ
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం జేఏఓ రవి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బిల్లింగ్ గుత్తేదారు నుంచి రూ. 16 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రవిని పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంతో పాటు నివాసంలో సోదాలు చేస్తున్నారు.