ఈడీ కేసులో రవిప్రకాశ్కు హైకోర్ట్లో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై ఈడీ కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసుని నమోదు చేశారు. ఇక తాజాగా ఈడీ కేసులో తెలంగాణ హైకోర్టులో రవిప్రకాష్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్ను అనుమతులు లేకుండా విత్డ్రా చేసిన కేసులో గతంలోనే తెలంగాణ హైకోర్టు పోలీసులకు స్టే ఆర్డర్ ఇచ్చింది.
ఇక తాజాగా తిరిగి అదే కేసును తెర మీదకు తీసుకురావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రవి ప్రకాష్ ను ఈడీ అరెస్ట్ చేయడానికి వీలులేకుండా హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రవి ప్రకాష్ తో పాటు మరో ఇద్దరు టీవీ9 మాతృసంస్థ అయిన అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుండి 18 కోట్ల రూపాయల నిధులను అనుమతి లేకుండా ఉపసంహరించుకున్నట్టు, దారి మళ్లించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
2018 సెప్టెంబర్ నుండి 2019 మే వరకు యాజమాన్యానికి తెలియకుండా రవి ప్రకాష్ ఉపసంహరించినట్లుగా చెప్తున్న నిధుల విషయంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ వర్గాలు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేశాయి. 2019 అక్టోబర్ లో ఇదే వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇక తాజాగా కేసు నమోదు చేసిన ఈడీ రవి ప్రకాష్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చెయ్యాలని భావిస్తున్న నేపధ్యంలో హైకోర్టు రవి ప్రకాష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వటం ఆయనకు ఒకింత ఉపశమనం .