ఇక ముందుకే: తెలంగాణ నూతన సచివాలయ డిజైన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయంకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం డిజైన్లు, ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ప్లాన్, బడ్జెట్ పై తుది నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.
సచివాలయ నిర్మాణం, అంచనా వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అదనపు ఏజీ రాంచందర్ రావును హైకోర్టు ఆదేశించింది. నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా సచివాలయ నిర్మాణానికి సంబంధించిన చర్యల గురించి ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో సచివాలయాన్ని కూల్చివేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దీని విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతీ లేదని అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు.
కూల్చివేత ఆపాలనే ఆదేశాలిచ్చామని.. నిర్మాణానికి సంబంధించిన నమూనా రూపకల్పన, అంచనా వ్యయం విషయంలో ఎలాంటి స్టేలు ఇవ్వలేదు కదా అని హైకోర్టు ఏఏజీని ప్రశ్నించింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణం కోసం రూ. 300 నుంచి రూ. 400 కోట్ల వరకు ఖర్చ అయ్యే అవకాశం ఉందని ఏఏజీ హైకోర్టుకు తెలిపారు. కాగా, సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి 12లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.