గ్రూప్-2అభ్యర్థులకు ఊరట: ఇంటర్వ్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, 1:2లోనే
హైదరాబాద్: ఉద్యోగాల నియామకాల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది.
రాత పరీక్షల్లో సరిగా బబ్లింగ్ చేయని, వైట్నర్ ఉపయోగించిన వారిని ఇంటర్వ్యూలకు అనుమతించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. శుక్రవారం దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పునిచ్చింది.
వైట్నర్ వాడిన, డబుల్ బబ్లింగ్ ఉన్న సమాధాన పత్రాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూ నిర్వహించడానికి కోర్టు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2016, సెప్టెంబర్లో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, గ్రూప్-2 పరీక్షలో 3,147మంది అభ్యర్థుల అర్హత సాధించారు. గ్రూప్-2లో అర్హత సాధించిన అభ్యర్థులకు 1:5కాకుండా 1:2 పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది.