10% రగడ : ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు, ఢిల్లీలో ధర్నాకు బీసీలు రె'ఢీ'..!
హైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం దుమారం రేపుతోంది. అది రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు బీసీ సంఘాల నేతలు. ఈ క్రమంలో ఆ చట్టాన్ని రద్దుచేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జడ్జి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రాజశేఖర్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
పిటిషనర్ తరపున వాదించిన లాయర్ రామచందర్ గౌడ్... పలు అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పేదరిక నిర్మూలన కోసం రిజర్వేషన్లు తేలేదని వివరించారు. సమాజంలో చోటుచేసుకుంటున్న వివక్ష వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేందుకు రిజర్వేషన్లు తెరపైకి వచ్చాయని తెలిపారు. కానీ పాలకులు అవేమీ పట్టించుకోకుండా రిజర్వేషన్ల ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ చట్టం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.
మరోవైపు 10% రిజర్వేషన్లను సవాల్ చేశారు జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 11న వేలాదిమందితో దేశరాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.