మంత్రి పదవి వివాదం: తలసానికి హైకోర్టు నోటీస్ జారీ
హైదరాబాద్: మంత్రి పదవి గొడవలో ఇరుక్కున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా జవాబివ్వాలంటూ కోర్టు ఆదేశించింది. తలసాని మంత్రి పదవికి అనర్హుడంటూ తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
గతంలో కూడా మంత్రి పదవికి తలసాని అనర్హుడంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ తాజా పరిణామంపై తలసాని ఎలా స్పందిస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరి మంత్రి పదవి పొందారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ ప్రభుత్వంలో చేరడంపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తాను శాసనసభా సభ్యత్వానికి రాజీనామా సమర్పించానని, అది స్పీకర్ ఆమోదం కోసం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ వస్తున్నారు. స్పీకర్ మధుసూదనాచారి తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కూడా ఆయన అన్నారు.