లాయర్ దంపతుల హత్య: సుందిళ్ల బ్యారేజీలో కత్తులు లభ్యం, భారీ అయస్కాంతాలతో..
హైదరాబాద్/మంథని: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో నిందితులు ఉపయోగించిన కత్తులను పోలీసులు గుర్తించారు. పార్వతి బ్యారేజీలో 53వ నెంబర్ పిల్లర్ వద్ద కత్తులు లభ్యమయ్యాయి. కేసు విచారణలో భాగంగా హత్యలకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
పెద్ద అయస్కాంతాలతో కత్తుల వెలికితీత
ఈ క్రమంలోనే నిందితులను ఆదివారం పార్వతి బ్యారేజ్ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో సోమవారం కూడా గాలింపు కొనసాగించారు. ఈసారి పెద్ద అయస్కాంతాల సాయంతో కత్తులను గుర్తించేందుకు శ్రమించారు. డ్రోన్లను కూడా ఉపయోగించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం.. 59-60 పిల్లర్ల వద్ద నుంచి క్రమంగా 53వ నెంబర్ పిల్లర్ వైపు గాలించగా అక్కడే కత్తులు లభ్యమయ్యాయి.
బాధితుల నుంచి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు
కాగా, వామన్ రావు దంపతుల హత్య కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాద దంపతుల హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన పోలీస్ శాఖ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు వేసింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద విచారించారని హైకోర్టు ప్రశ్నించింది. ఎంతమందిని మంథని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని హైకోర్టు ప్రశ్నించింది. బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ ని ఎందుకు రికార్డు చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. బాధితులను అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు వారి వాంగ్మూలాన్నినమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని నిలదీసింది. అయితే, బాధితులు తీవ్రగాయాలతో బాధపడుతుండటంతో వారిని ప్రశ్నించలేకపోయామని పోలీసుల తరపున ఏజీ కోర్టుకు తెలిపారు.
హైకోర్టు ప్రశ్నలు.. ఏజీ వివరణ
హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్ రక్తపు మరకలను కాల్ డేటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తెలిపారు. ఈ కేసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించినట్లు కోర్టు ఏజీ తెలిపారు. ప్రత్యక్ష సాక్షులకు ఎటువంటి రక్షణ కల్పించారో హైకోర్టు తెలపాలనగా.. పోలీసులు అన్ని రక్షణ చర్యలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ వివరించారు. నిందితుల నుంచి సీఆర్పీసీ 161 కింద వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది సాక్షులను గుర్తించినట్లు తెలిపారు. నేరస్తుల నుంచి ఇంకా కావాల్సిన సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని ఏజీ తెలిపారు. మరో రెండు వారాల గడువు కావాలని కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు మార్చి 15కు వాయిదా వేసింది.