కోమటిరెడ్డి-సంపత్ల కేసు: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్, వారందరికీ నోటీసులు
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ల అనర్హత పిటిషన్ కేసులో హైకోర్టు మంగళవారం పలువురికి నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు ఫాం 1 నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 17వ తేదీన నేరుగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలను, అలాగే అసెంబ్లీ రిజిస్టర్ను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్ల అసెంబ్లీ సభ్యత్వం రద్దుపై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, నోటీసులు జారీ చేసింది.
వీరి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇది గట్టి షాకే. తెలంగాణ స్పీకర్కు కూడా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్మెన్లను కేటాయించని కారణంగా డీజీపీ, గద్వాల, నల్గొండ ఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని హైకోర్టు పేర్కొంది.
కోర్టులో తమకు న్యాయం జరుగుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లు అన్నారు. కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. వీరి సభ్యత్వ రద్దుపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసెంబ్లీ సమావేశాల సమయంలో హెడ్ ఫోన్స్ విసిరి దాడి చేసారంటూ కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి సభ్యత్వాల రద్దు చెల్లదని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని వెల్లడించింది. దీనిపై 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్కు వెళ్లగా అక్కడ చుక్కెదురైంది.
ఇటీవల వాదనల సమయంలో తెలంగాణ ఏజీపై హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాదా లేక పార్టీ తరఫు న్యాయవాదా అని అడిషనల్ ఏజీ రామచంద్ర రావును హైకోర్టు ప్రశ్నించింది. వారం రోజుల్లోగా హైకోర్టు తీర్పుపై స్పందించాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది. లేదంటే అసెంబ్లీ కార్యదర్శి, సెక్రటరీ నేరుగా కోర్టుకు రావాల్సి ఉంటుందని సీరియస్ అయింది.