బెయిల్ రద్దుపై హైకోర్టు నోటీసులు, కౌంటర్: రేవంత్ రెడ్డికి 2నెలలు ఊరట
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఈ నెల 16వ ఏసీబీ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది.
కాగా, ఓటుకు నోటు కేసులో... రేవంత్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏసీబీ దాదాపు వారం రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నెల రోజులు జైలు జీవితం గడిపిన రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడం, ఇటీవలే బెయిల్ షరతులను సడలించిన నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆ పిటిషన్ లో ఏసీబీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.
రెండు నెలలు వాయిదా
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న పిటిషన్ పైన విచారణను హైకోర్టు రెండు నెలలు వాయిదా వేసింది. హైకోర్టులో రేవంత్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో, విచారణను మరో రెండు నెలలు వాయిదా వేసింది.
ఇంజినీరింగ్ కాలేజీలపై హైకోర్టు ఆదేశం
తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పిన ఇంజినీరింగ్ కళాశాలలపై దాఖలైన పిటిషన్ పైన హైకోర్టు స్పందించింది. తెలంగాణలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల పని తీరుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఆరు వారాల్లో ఫ్యాకల్టీ, సదుపాయాలు సమకూర్చుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే అడ్మిషన్లు నిర్వహించుకోవాలని సూచించింది. హైకోర్టు ప్రతినిధితో ఐదుగురు సభ్యుల కమిటీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తుందని కోర్టు తెలిపింది. ప్రమాణాలు లేకుంటే అడ్మిషన్లు రద్దు చేస్తామని హెచ్చరించింది.