తెలంగాణ, ఏపీ చర్చించుకోవాలి లేదంటే మేం ఆదేశిస్తాం: హైకోర్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం పైన గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు స్పందించింది.
రెండు రాష్ట్రాల విద్యుత్ కార్యదర్శులు కూర్చొని చర్చించుకోవాలని సూచించింది. విద్యుత్ కార్యదర్శులు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించింది. పరిష్కరించుకోలేకపోతే తామే ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది.
ప్రధాని మోడీపై విహెచ్ ఆగ్రహం
అవినీతికి తాము వ్యతిరేకమని, నిజాయతీగా పరిపాలన చేస్తామని గతంలో చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు అవినీతిపరులకు అండగా నిలబడ్డారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు గురువారం ఆరోపించారు.
యూపీఏ పాలనలో కోల్గేట్, ఆదర్శ్, 2జీ స్కాంల విషయమై పార్లమెంటులో అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్లు సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని, దీంతో ఎంతో కీలకమైన పార్లమెంటు సమావేశాలకు విఘాతం కలగకూడదని అప్పటి మంత్రులైన నట్వర్ సింగ్, దాసరి నారాయణరావు, అశ్వినీ కుమార్, పవన్ కుమార్ భన్సల్లను వారు తప్పు చేయనప్పటికీ పదవులకు సోనియా గాంధీ రాజీనామా చేయించారన్నారు.
ఇప్పుడు లలిత్ మోడీ కుంభకోణంలో చిక్కుకున్న సుష్మా స్వరాజ్, వసుంధర రాజేల రాజీనామా కోసం పార్లమెంటులో తాము అడ్డుపడితే, తమను అభివృద్ధి నిరోధకులని అంటున్నారన్నారు. తాము వాస్తవాలు తెలియజేసేందుకు ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు.