విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ రాజ్యాంగ విరుద్ధం: తెలంగాణను తప్పుబట్టిన హైకోర్టు
హైదరాబాద్: స్థానికత ఆధారంగా ఏపీ విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడేళ్లుగా నడుస్తున్న ఈ వివాదంపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. స్థానికత ఆధారంగా ఉద్యోగులను రిలీవ్ చేయడాన్ని తప్పుబట్టింది.
ఏపీ స్థానికత ఉన్న 1200 మంది ఉద్యోగులను రిలీవ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, డిస్కంలలో పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
దీన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ 42 శాతం జీతాలుగా చెల్లిస్తున్నాయి.
ఈ వివాదంపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగుల రిలీవ్ను తప్పుబడుతూ శుక్రవారంఎ తీర్పు వెలువరించింది. దీంతో పాటు ఉద్యోగులకు వేతనంగా చెల్లించిన మొత్తాన్ని కూడా ఏపీకి తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల వివాదంపై ఒక కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలల్లో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.