స్మితా సబర్వాల్కు కోర్టు ఖర్చులపై వివరణ ఇవ్వండి: మరోసారి గడువు కోరవద్దన్న హైకోర్టు
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్కు 'ఔట్లుక్ మ్యాగజైన్' కథనం వివాదంలో న్యాయపరమైన ఖర్చుల కోసం.. రూ.15లక్షలు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో 'తెలంగాణ సర్కారు' ప్రమాణపత్రం దాఖలకు హైకోర్టు మరోసారి గడువిచ్చింది.
కౌంటర్ దాఖలుకు గడువు కోరడం ఇది రెండోసారని.. మరోసారి సమయం కోరకుండా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) బి.మహేందర్రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబరు 16కు వాయిదా వేసింది.
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఎస్జీపీ మహేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యాల్లో ప్రమాణపత్రం దాఖలుకు మరికొంత సమయం కావాలన్నారు.
పిటిషనర్ ఈశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి స్పందిస్తూ.. స్మితాసబర్వాల్కు కూడా నోటీసులు జారీచేసి, ప్రమాణపత్రం దాఖలు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. నోటీసుల అవసరం అనుకుంటే తగిన సమయంలో జారీచేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.