ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట.. సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటూ..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. కార్మికులకు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండటంతో సమ్మె మరింత ఉద్రిక్తంగా తయారైంది. ఆర్టీసీ సమ్మె అంశం హైకోర్టు మెట్లు ఎక్కడంతో మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేయడానికి పలు మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే విధుల్లోకి చేరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని కార్మిక సంఘాలకు సూచించింది. పండుగ నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం సమంజసం కాదని చెప్పిన కోర్టు.. అటు ప్రభుత్వానికి కూడా మొట్టికాయలు వేసింది.
అయితే బుధవారం నాడు జరిగిన వాదనల సందర్భంగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది కోర్టు. సమ్మెలో ఉన్న కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు నిలిపివేయడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో ఆర్టీసీ కార్మికులకు ఊరట కలిగించేలా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
ఆర్టీసీ సమ్మెలో భాగమైన కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇంతవరకు చెల్లించలేదు. ఆ క్రమంలో హైదరాబాద్కు చెందిన ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ జీతం రాని నేపథ్యంలో హౌసింగ్ లోన్ చెక్ బౌన్స్ అయిందనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం నెల జీతాల మీదనే ఆధారపడ్డ ఆర్టీసీ కార్మికులు ఇలా చాలామంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు సోమవారం లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.