సమాధానం చెప్పాలి: ఓటర్ల జాబితాపై హైకోర్టు, చంద్రబాబును కేసీఆర్ అలా అంటారా: మర్రి
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, ఓట్ల అవకతవకలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీం కోర్టు కాపీ అందడంతో వాదనలు ప్రారంభమయ్యాయి. హైకోర్టు రెండు పిటిషన్లను కొట్టి వేసింది. కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు కొనసాగాయి. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Recommended Video
ముందస్తు ఎన్నికలపై స్టే విధించే అధికారం హైకోర్టుకు: కేసీఆర్కు సుప్రీం కోర్టు ఝలక్!
ఓటర్ జాబితాలోని అవకతవకలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో హైకోర్టు రెండింటిని కొట్టి వేసింది. మిగతా రెండింటిపై సోమవారం విచారణ జరగనుంది. ఈ నెల 8వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఓటర్ల తుది జాబితాను తమకు అందించాలని హైకోర్టు ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.
మీడియాతో మర్రి శశిధర్ రెడ్డి
విచారణను హైకోర్టు వాయిదా వేసిన అనంతరం కాంగ్రెస్ నేత మర్రి శసిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014లో తెరాసకు ఓటు వేయని వారి ఓట్లు తొలగించాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నించారని ఆరోపించారు. బహిరంగ సభలో తోటి ముఖ్యమంత్రిపై (నారా చంద్రబాబు నాయుడు) కేసీఆర్ వాడిన పదజాలం ఏమాత్రం సరికాదన్నారు. మేం కేసీఆర్లా దిగజారిపోలేదని చెప్పారు.
మా వాదనలో న్యాయం ఉంటే స్టే
అక్రమ ఓటర్ల లిస్టును ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ వ్యూహాలు రచించారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు. ఈసీ తన అధికారుల బృందాన్ని పంపి విషయాన్ని అధ్యయనం చేసే వరకు ఓఫిక పట్టడం లేదన్నారు. తాము సుప్రీం కోర్టుకు వెళ్లి మాట్లాడిన సమయంలో వారు హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించారని, అందుకే హైకోర్టుకు వచ్చామని చెప్పారు. మా వాదనలో న్యాయం ఉంటే స్టే విధించవచ్చునని చెప్పిందని అన్నారు.
అభ్యంతరాలపై ఈసీ కౌంటర్ దాఖలు చేయాల్సిందే
ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ఎన్నికల ప్రక్రియలో భాగమేనని ఈసీ తరఫు న్యాయవాది చెప్పారని, నామినేషన్ వరకు కూడా సవరణలు చేసుకోవచ్చునని వారు చెప్పారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియను అలాగే ముందుకు తీసుకు వెళ్లవద్దని, లిఖితపూర్వకంగా వాదనలు వినిపించాకే ముందుకు వెళ్లాలని కోర్టు ఈసీకి చెప్పిందని అన్నారు. పిటిషన్లో పేర్కొన్న అభ్యంతరాలపై సమాధానాలు చెప్పాకే ముందుకెళ్లాలని కోర్టు చెప్పిందని అన్నారు. తాను, జంధ్యాల రవిశంకర్లం వ్యక్తిగతంగా కేసు వేశామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వేశామన్నారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఓ ఎన్నిక ఊసు లేదన్నారు. తమ అభ్యంతరాలపై ఈసీ కౌంటర్ దాఖలు చేయాలన్నారు.
లాయర్ ఏం చెప్పారంటే
20 లక్షల ఓట్లు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోయాయని, అందుకే అవి తగ్గాయని చెప్పారని, కానీ ఏపీలో 15 లక్షలు తగ్గాయని, అవి ఎందుకు తగ్గాయో చెప్పలేదని లాయర్ జంధ్యాల రవిశంకర్ అన్నారు. ఒకే పేరుతో, ఒకే ఐడీతో వివిధ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయని, పలు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. దాదాపు 1500 ఇళ్లలో 50 నుంచి 100 ఓట్లు రిజిస్టర్ అయి ఉన్నాయని ఆరోపించారు. అలాగే, ఒకే ఇంటి అడ్రస్ పేరుతో ఎన్నో ఓట్లు నమోదు చేయించుకున్నారని చెప్పారు. ఇంటికి వివిధ నెంబర్లు, పాత ఇంటి నెంబర్లతో ఓట్లు నమోదు చేయించుకున్నారని చెప్పారు.