ఎస్సై రామకృష్ణా రెడ్డి కేసులో కొత్త మలుపు: హైకోర్టు తీవ్ర ఆగ్రహం, సూటి ప్రశ్న
హైదరాబాద్: కుకునూర్ పల్లి ఎస్సై రామకృష్ణా రెడ్డి ఆత్మహత్య కేసు శుక్రవారం నాడు మలుపు తిరిగింది. ఆయన సూసైడ్ నోట్ పైన హైకోర్టు ఈ రోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ డీఎస్పీ శ్రీధర్, సీఐలపై మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
మాజీ డీఎస్పీ శ్రీధర్, సీఐలపై వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ హైకోర్టులో అతడి భార్య పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
రామకృష్ణా రెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించింది. వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే స్థానిక పోలీసులు తనకు న్యాయం చేయరని, దీన్ని సీబీఐకి అప్పగించాలని రామకృష్ణా రెడ్డి భార్య కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.