వివేక్కు షాక్: హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తూ హైకోర్టు తీర్పు, అజహరుద్దీన్ హర్షం
హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జీ వివేక్కు మంగళవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంబుడ్స్మన్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్ హెచ్సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని కోర్టు తీర్పునిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్సీఏ అధ్యక్ష పదవికి వివేక్ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్మన్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్సీఏకు అధ్యక్షుడిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ అప్పట్లో స్టే విధించింది. తాజాగా హైకోర్టు.. అంబుడ్స్మన్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గతంలో అంబుడ్స్మన్ ఇచ్చిన తీర్పు సరైందేనని అన్నారు. వివేక్ ఎన్నిక సరైన పద్ధతిలో జరగలేదని అన్నారు. ఇన్నాళ్లకు హెచ్సీఏలో న్యాయం జరిగిందని అజహరుద్దీన్ అన్నారు.