బెంగళూర్ని చూడండి: నిమజ్జనంపై హైకోర్టు, ఆ మొత్తం ఉంచండి, ఏపీ బోర్డ్ ఖాతాలపై..
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం నాడు న్యాయస్థానం స్పందిస్తూ... కర్నాటక రాజధాని బెంగళూరులో నిమజ్జనం జరిగే విధానాన్ని పరిశీలించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి)ని ఆదేశించింది.
హైదరాబాదులో ప్రతి ఏటా వేలాది విగ్రహాలు నిమజ్జనం అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, వినాయక విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేయడాన్ని సవాల్ చేస్తూ వేణుమాధవ్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అనంతరం స్పందిస్తూ.... బెంగళూరు నిమజ్జనం విధానాన్ని పరిశీలించాలని సూచించింది.
ఏపీ బోర్డు ఖాతాల నిలిపివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింప చేయాలంటూ ఎస్బీఐకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి లేఖ రాయడం, ఇంటర్ విద్యా మండలి వ్యాజ్యం నేపథ్యంలో.. హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ విద్యామండలి కార్యదర్శి బ్యాంకుకు రాసిన లేఖ పైన ఏపీ ఇంటర్ విద్యా మండలి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఖాతాలు స్తంభింప చేసే నాటికి ఉన్న మొత్తాన్ని అలాగే ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.