ధరణిలో ఆస్తుల నమోదుపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు సర్కార్ కు ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములతో పాటుగా, వ్యవసాయేతర ఆస్తులపై కూడా సర్వే చేయించి వివరాలు సేకరించే పనిలో పడింది. ఇళ్ళు, షాపులు , ఖాళీ స్థలాలు, ఇలా ప్రజల ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే పనిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయాలని చూస్తున్న ధరణి వెబ్ సైట్ లో ఆస్తుల నమోదు ప్రక్రియపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది గోపాల్ శర్మ. రాష్ట్రంలో ప్రజల నుండి ధరణి వెబ్ పోర్టల్ లో ఆస్తుల నమోదు ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసిన సర్కార్ ..వరదల ఎఫెక్ట్
ఈ నేపథ్యంలో దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై నేడు విచారణ జరిపిన హైకోర్టు ఆసక్తికర ప్రశ్నలను వేసింది. ప్రభుత్వం నుండి సమాధానాలను కోరింది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని, కేసును వాయిదా వేసింది.
న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో చట్టబద్ధత లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని , ఆధార్, కులం వివరాలు అడుగుతున్నారని , ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం అని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
Recommended Video
అయితే ధర్మాసనం సేకరించిన వివరాలను రహస్యంగా ఉంచితే తప్పేమీ లేదు కదా అంటూ విచారణ సందర్భంగా పిటిషనర్ ను ప్రశ్నించింది. అంతేకాదు ప్రభుత్వ సమాధానాన్ని సైతం కోరింది ధరణి వెబ్ సైట్ లో ఆస్తులు నమోదుకు గడువు లేదని ఇది నిరంతర ప్రక్రియ అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఆస్తుల నమోదుకు చివరి తేదీ లేదని అడ్వకేట్ జనరల్ బి ఎస్ ప్రసాద్ వివరణను హైకోర్టు నమోదు చేయడంతో పాటుగా,దీనికి సంబంధించిన కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది . ధరణికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చెయ్యాలని సూచించింది. న్యాయవాది గోపాల్ శర్మ పిటిషన్ పై విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.