నెల జీతం 500లా, ఎలా బతుకుతారు: తెలంగాణకు హైకోర్టు ప్రశ్న, ఆశ్చర్యం
హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.500 వేతనం చెల్లిస్తే వారు ఎలా బతుకుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. కార్మికులకు వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ల పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీసింది.
సంబంధిత గుత్తేదారులు కనీస వేతనాలు చెల్లించకపోతే మీరేమి చేస్తున్నారని ప్రశ్నించింది. బాధ్యుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని, వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం హైకోర్టులో విచారణకు మంగళవారం నాడు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపించారు.
గ్రామ పంచాయతీల్లో వివిధ ఉద్యోగాలు పని చేస్తున్నారని, వారికి చెల్లిస్తున్న వేతనాలు కనీసం లేవని చెప్పారు. కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.1000 చెల్లిస్తుండటంపై హైకోర్టు ఆశ్రర్యం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఉద్దేశించి వారు ఎలా బతుకుతారని ప్రశ్నించింది.
హన్మకొండలో తెదేపా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దీక్ష
వరంగల్ జిల్లా హన్మకొండలో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం ఉదయం దీక్ష చేపట్టారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 5గంటల వకు దీక్ష కొనసాగుతుందని తెదేపా నేతలు తెలిపారు. ఎర్రబెల్లికి వుద్దతుగా పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.