ఆంధ్రజ్యోతి రాధాకష్ణకు పెద్ద ఊరట.. ఆళ్ల పరువునష్టం కేసును కొట్టేసిన హైకోర్టు!
హైదరాబాద్: వైసీపీ ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఆళ్ల వేసిన పరువు నష్టం కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు పెద్ద ఊరట లభించినట్లయింది.
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనంపై ఎమ్మెల్యే ఆళ్ల పరువునష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోడీని కలిసి వైఎస్ జగన్ వినతి పత్రం ఇచ్చిన వైనంపై 'అమ్మ జగనా' అనే కథనాన్ని గతేడాది మే 15న ఆంధ్రజ్యోతి ప్రచురించింది. తమ పార్టీ నాయకుడికి, పార్టీకి ఈ కథనం నష్టం చేకూర్చేలా ఉందని, అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశారు.
కేసును కొట్టివేయాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని లోతుగా విచారించిన హైకోర్టు 69 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది.
ఆంధ్రజ్యోతి కథనంలో మీకేం సంబంధం ఉందంటూ పిటిషనర్ను హైకోర్టు న్యాయమూర్తి నిలదీశారు. సంబంధం లేని అంశంపై కోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. పిటిషనర్కు ఎలాంటి అర్హతా లేదని స్పష్టం చేశారు.
అభ్యంతరకరమైన కథనం ప్రచురిస్తే బాధితులే కోర్టును ఆశ్రయించాలని, ఈ కేసుతో పిటిషనర్కు ఎటువంటి సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కింది కోర్టులో రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువునష్టం కేసును న్యాయమూర్తి కొట్టివేశారు.
ఈ కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలతో ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు, బ్యూరో చీఫ్కు సంబంధం ఉన్నట్లు పిటిషనర్ ఎటువంటి ఆధారం చూపలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.