తిరగబడ్డ మందు బిడ్డ..! తాగి వాహనం నడిపితే యాజమాన్యాలకు చెప్పాలా..? పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు..!
హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడుపడం (డ్రంకెన్డ్రైవ్) ద్వారా పట్టుబడిన ఉద్యోగుల సమాచారం.. సదరు ఉద్యోగుల యాజమాన్యాలకు తెలియజేయాలని చట్టంలోని ఏ నిబంధన పేర్కొంటున్నదో తమకు వివరించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనాలను పోలీసులు నిరవధికంగా తమ కస్టడీలో ఉంచుకోవడం.. పట్టుబడ్డ ఉద్యోగుల సమాచారాన్ని సంబంధిత యాజమాన్యాలకు తెలియజేయడం వంటి పోలీస్ చర్యలను సవాల్చేస్తూ పృథ్వీకృష్ణ అనే ప్రైవేట్ ఉద్యోగి హైకోర్టు ను ఆశ్రయించారు.
మోటర్వెహికిల్ యాక్ట్లో వాహనాలను నిరవధికంగా నిర్బంధంలో ఉంచాలన్న నిబంధన ఎక్కడాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేశ్చంద్ర వాదించారు. పోలీసులు పట్టుబడ్డ ఉద్యోగి యాజమాన్యాలకు లేఖలు రాస్తున్నారని.. దీనివల్ల చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. దీనిపై ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదావేసింది.మద్యం తాగి డ్రైవ్ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.
బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వారి బతుకుల్లో పూడ్చలేని లోటేర్పడుతుంది. అధికారులైనా, ఉద్యోగులైనా, ప్రముఖులైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా సరే, సమాజంలో ఉన్న హోదా, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకుంటే ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుంది. అందరికీ సంతోషమనే విషయాన్ని గుర్తించి, జాగ్రత్తలు తీసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. తాగిన మైకంలో పోలీసులతో దురుసు ప్రవర్తన, ఇలాంటి వార్తలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. అందరినీ నచ్చజెప్పి వారికి కౌన్సెలింగ్లు నిర్వహించి ఓపికగా పోలీసులు సక్రమ మార్గం చూపుతుంటారు.
కానీ నగరంలో చోటు చేసుకుంటున్న ఒకటి రెండు ఘటనలు పాఠాలు చెప్పే పోలీసు శాఖనే ప్రశ్నించేలా ఉన్నాయి. వాస్తవానికి మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం.. నేరం అనే విషయం వారికి తెలియంది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు నిబంధనలను పక్కన పెట్టడంతో ఆయా అధికారులు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మద్యం మహమ్మారి సాధారణ వ్యక్తులనే కాదు.. చట్టం గురించి తెలిసిన వారిని సైతం బోల్తా కొట్టిస్తుందనడానికి నగరంలో చోటు చేసుకున్న ఘటనలే నిదర్శనం.