ఆ భవనాలు ఖాళీగానే ఉన్నాయి కాదా?: సచివాలయం కూల్చివేతపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నల వర్షం
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సచివాలయ కూల్చివేతపై తెలంగాణ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. పీఎల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి.
కాగా, ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఎందుకు కూల్చివేస్తున్నారు? అలా చెప్పలేదే..?
హైకోర్టు పిటిషనర్, ప్రభుత్వ తరపు న్యాయవాదులను వివిధ అంశాలపై ప్రశ్నించింది. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, ప్రస్తుతం ఉన్న భవనాలకు అగ్ని ప్రమాదాలు పొంచివున్నాయని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చిందంటూ ప్రభుత్వం తరపున అదనపు ఏజీ వాదనలు వినిపించారు.
అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని మాత్రమే ఫైర్ డిపార్ట్మెంట్ సూచనలు చేసిందని, భవనాలు కూల్చమని చెప్పలేదు కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అన్ని శాఖలు ఒకే చోట ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అదనపు ఏజీ హైకోర్టుకు వివరించారు.
ఆ భవనాలు సరిపోవా?
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసిన ఐదు బ్లాకుల భవనాలు కూడా ఉన్నాయి కదా? అవి సరిపోవా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కొత్త సచివాలయం నిర్మించాలంటూ సాంకేతిక కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాతే సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రజల కోసం కాదా అంటూ పిటిషనర్కు..
ఇక పిటిషనర్ విశ్వేశ్వరరావు తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కూడా హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. పరిపాలన అంశాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు.అయితే, సచివాలయ నిర్మాణం ప్రజల కోసం కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వమే నిర్ణయిస్తుంది..
ఇప్పటికే అప్పుల కారణంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే, ప్రజాధనం ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని.. కోర్టులు కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇరువైపుల వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుత సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇప్పటికే ప్రస్తుత సచివాలయంలోని కొన్ని కార్యాలయాలను బూర్గుల భవనానికి తరలించారు కూడా. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సర్కారు అనుకున్నట్లుగా కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు మార్గం సుగమం కానుంది.