అక్బరుద్దీన్పై ఛార్జీషీట్కు ఇంకెంత కాలం?: హైకోర్టు, దర్యాఫ్తు పూర్తయింది..
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పైన కేసులో ఛార్జీషీటుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం నాడు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ను (పిపి) ప్రశ్నించింది. అక్బరుద్దీన్ కేసు విచారణ హైకోర్టులో జరిగింది.
గతంలో ఓ మతాన్ని కించపరిచారని అక్బరుద్దీన్ పైన కేసు నమోదయింది. దీనిపై అభియోగపత్రం దాఖలు కాలేదు. దీంతో అభియోగపత్రం దాఖలుకు ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీని పైన సోమవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా హైకోర్టు.. ఛార్జీషీట్ దాఖలుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని పిపిని ప్రశ్నించింది. దర్యాఫ్తు పూర్తయిందని, ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నామని పిపి చెప్పారు. అనంతరం విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది.
అమాయక యువతలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా 2012 డిసెంబర్ నెలలో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అక్బరుద్దీన్ పైన 2013లో నమోదైన రెండు కేసుల్లో పోలీసులు ఇప్పటి వరకు ఛార్జీషీట్లు దాఖలు చేయలేదని పిల్ దాఖలైంది.
హైదరాబాద్కు చెందిన న్యాయవాది, సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ టి ఖాద్రీ ఈ పిల్ దాఖలు చేశారు. అదిలాబాద్ జిల్లా నిర్మల్, నిజామాబాద్ జిల్లా రెండో పట్టణ పోలీసు అక్బరుద్దీన్ ఓవైసీ పైన రెండు కేసులు నమోదయ్యాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.