సచిన్లాంటి వారు ఎలా వచ్చారు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన హైకోర్టు ఘాటైన ప్రశ్నలు సంధించింది. ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి ఏర్పాటు చేస్తే పిల్లలు ఎక్కడ ఆడుకుంటారని, ఎంత స్థలం మిగులుతుందో చెప్పాలని తెలంగాణ సర్కారను హైకోర్టు ప్రశ్నించింది.
పట్టణీకరణ నేపథ్యంలో పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేకుండా పోతోందని, దీనివల్ల టీవీలకు, వీడియో గేమ్లకు అతుక్కుపోతున్నారని పేర్కొంది. ఆడుకోవడానికి స్థలాలు లేకుంటే సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ లాంటి వారు వెలుగులోకి వచ్చే వారా అని తెలంగాణ సర్కారును ప్రశ్నించింది.
ముంబైలోని శివాజీ పార్కు వల్లే వారు వెలుగులోకి వచ్చారని గుర్తు చేసింది. కన్వెన్షన్ సెంటర్లు, ఆడిటోరియాలు ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ సర్కారు తప్పు చేస్తోందని అనలేమని, కానీ పిల్లల కోసమే తమ తపన అంతా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాలని తెలంగాణ సర్కారును హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఎన్టీఆర్ మైదానంలో తెలంగాణ కళాభారతి ఏర్పాటుకు తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఇందిరా పార్కు పాదచారుల సంఘం అధ్యక్షులు సుధాకర్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు దీనిపై విచారణ జరిగింది. కాగా, ఎన్టీఆర్ మైదానం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్థలాన్ని పిల్లలు ఆడుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది.