రూట్ల ప్రైయివేటీకరణ ఆపండి..!కార్మికులతో చర్చలు జరపాలని టీ సర్కార్ కు కోర్ట్ మరోసారి సూచన..!!
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్ట్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తంలో ఆర్టీసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారో గాని అప్పటినుండి కోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పులు వెలువడుతున్నాయి. శుక్రవారం నాడు తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీలో ఐదువేల ఒక వంద రూట్లను ప్రైవేటీకరణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని నిలిపివేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి.. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించిన కోర్ట్..
అంతే కాకుండా రాష్ట్ర కేబినెట్ ప్రొసీడింగ్స్ను తమ ముందు ఉంచాలని తెలిపింది. సోమవారం వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 11 కి(సోమవారాని) వాయిదా వేసింది. అదే రోజు ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదలకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది. గురువారం ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, కార్మికులతో చర్చలు జరపాలని మరోసారి ప్రభుత్వానికి సూచించింది.
ప్రభుత్వం పై మండి పడ్డ కోర్ట్.. ప్రయివేటు రూట్ల పై స్టే..
టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదన్న కేంద్రం తరఫు న్యాయవాది అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు హైకోర్టుకు తెలిపారు. కేంద్రానికి 33 శాతం వాటా ఏపీఎస్ఆర్టీసీలో ఉందని, టీఎస్ ఆర్టీసీకి ఆటోమేటిక్ గా బదిలీ కాదని వాదించారు. ఆర్టీసీ సమ్మె పై కేంద్ర ప్రభుత్వం తరఫున రాజేశ్వర్ రావు వాదనలు వినిపించారు. అలాంటప్పుడు టీఎస్ ఆర్టీసీలో 33శాతం వాటా ప్రశ్నే తలెత్తదన్నారు. ఆర్టీసీ రీ ఆర్గనైజేషన్ కు తెలంగాణ ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదన్నారు. షెడ్యూలు 9 కింద ఆర్టీసీ వస్తుందని తెలంగాణ సీఎస్ జోషి తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు ఏజీ ప్రసాద్, ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మలు తెలిపారు. అయితే ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగులో ఉందని ఏజీ వివరించారు.
ఉద్యోగులంటే ఎందుకంత కఠినత్వం..
ఆర్టీసీ యాజమాన్యం,కార్మికుల మధ్య సయోధ్య చేయాలని కార్మికుల తరుపున ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్చందంగా ముందుకు రావడం లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. మీరు 5 నిమిషాలు నా స్ధానంలో ఉండి నేను 5 నిమిషాలు మీ స్ధానంలో ఉండి చూడండి. మీ నివేదికలు, మీరు చెప్పే మాటలు నమ్మదగ్గ విధంగా ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు సమర్పించిన లెక్కలు గజిబిజిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల పట్ల చూపాల్సింది అధికారం కాదని, ఔదార్యం అని తెలంగాణ హైకోర్ట్ సూచించింది.
ఛలో ట్యాంక్ బండ్ కి అనుమతి నిరాకరణ..
తెలంగాణ ప్రభుత్వం, న్యాయస్థానం మద్యం పరిస్థితి ఇలా ఉంటే ఆర్టీసి జేఏసీ నాయకులు ఛలో ట్యాంక్ మండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నవంబర్ 9, శనివారం రోజున లక్షమంది ఉద్యోగులతో మార్చ్ నిర్వమిస్తామని జేఏసి నేతలు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలనుండి వచ్చే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని, అందుకే శుక్రవారం రాత్రికే కార్మికులందరూ హైదరాబాద్ చేరుకోవాలని జేఎసీ నేత అశ్వథ్తామ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా రేపు (శనివారం) తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కు అనుమతి కోసం అఖిల పక్షం నేతలు హైరాబాద్ పోలీస్ కమిషనర్ అజనీకుమార్ ని కలిశారు. ఈ సందర్భంగా ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.