సత్యం రాజుకు నిరాశ: అపీల్ను తిరస్కరించిన హైకోర్టు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పది మంది దోషులకు గురువారంనాడు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ వాళ్లు దాఖలు చేసుకున్న అప్పీళ్లను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాదులోని నాంపల్లి ఎంఎస్జె కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు వారికి సూచించింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలినవాళ్లంతా తొలుత నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్జె) కోర్టులోనే తమ అప్పీళ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.
అయితే, సత్యం రామలింగ రాజు అప్పీల్ పిటిషన్ను నాంపల్లి న్యాయస్థానం ఏప్రిల్ 20వ తేదీన తిరస్కరించింది. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని రామలింగ రాజుకు, ఇతరులకు న్యాయస్థానం సూచించింది.
సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజుకు, మరో తొమ్మిది మందికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను, భారీగా నగదు జరిమానాను విధించిన విషయం తెలిసిందే. దీనిపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం సమయమిచ్చింది. దీంతో రామలింగ రాజు, తదితరులు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేశారు. ప్రస్తుతం రామలింగ రాజు సహా మిగతా దోషులు హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నారు.