కోమటిరెడ్డి, సంపత్ కేసు: హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ్యత్వాల రద్దుపై విచారణ చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్పై హెడ్ఫోన్ విసరడంతో మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వాలను రద్దు చేశారు. దీనిపై ఈ ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్పై నెలరోజులుగా హైకోర్టులో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తన వాదనలను విన్పించారు.తమ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తున్న విషయమై లిఖిత పూర్వకంగా చెప్పలేదని హైకోర్టుకు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. తాము కోర్టును ఆశ్రయించిన తర్వాత అసెంబ్లీ నుండి బహిష్కరించినట్టుగా గవర్నర్ సంతకంతో అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టారని కాంగ్రెస్ నేతల తరుపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టుకు తెలిపారు.
అంతేకాదు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ గవర్నర్ పరిధిలో ఉంటుందని కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ కంటికి గాయమైందని మీడియాలో వార్తలు వచ్చాయని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో పుటేజీలను అడిగితే ఇవ్వలేదని ఆయన కోర్టుకు చెప్పారు.
అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి రాజీనామా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీ తరపున హైకోర్టులో ఎవరూ కూడ వాదనలు విన్పించలేదు. అయితే అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ప్రభుత్వం తరుపున వాదించారు.
ఆరు మాసాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేతల పిటిషన్పై హైకోర్టు గతంలోనే తీర్పును వెలువరించింది. ఆరు వారాల వరకు ఈ విషయమై ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాము ఎలాంటి ఉత్తర్వులు వెల్లడించలేదని హైకోర్టుకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
అన్ని వర్గాల వాదనలు విన్న హైకోర్టు సోమవారం నాడు ఈ అంశంపై వాదనలను ముగిసినట్టుగా ప్రకటించింది. అయితే ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.