ఓయూలో బీఫ్ ఫెస్టివెల్ వద్దు: షాకిచ్చిన హైకోర్టు, రాజాసింగ్ హ్యాపీ
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం నాడు (10వ తేదీన) తలపెట్టిన బీఫ్ ఫెస్టివెల్ విషయంలో నిర్వాహకులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులోను చుక్కెదురయింది. ఎట్టి పరిస్థితుల్లోను బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.
హైకోర్టులో బీఫ్ ఫెస్టివెల్ నిర్వహణ పైన కడెం రాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అంతకుముందే సిటీ సివిల్ కోర్టులో బీఫ్ ఫెస్టివెల్ నిర్వాహకులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఫెస్టివెల్ నిర్వహణకు అనుమతిని నిరాకరించింది. దీంతో, ఈ వివాదం హైకోర్టుకు వెళ్లింది.
ఓయులో బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించవద్దని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. ఫెస్టివెల్ నిర్వహించకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తెలిపింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఓయూలో బీఫ్ ఫెస్టివెల్ వద్దంటూ కడెం రాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పైవిధంగా స్పందించింది.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 10వ తేదీన బీఫ్ ఫెస్టివెల్ నిర్వహిస్తామని కొందరు విద్యార్థులు చెప్పారు. దానికి ప్రతిగా పోర్క్ ఫెస్టివెల్ నిర్వహించేందుకు మరికొంతమంది విద్యార్థులు ముందుకు వచ్చారు. మరోవైపు, గోపూజ చేస్తామని ఇంకొందరు, జంతువులను చంపవద్దని పెటా విజ్ఞప్తి చేసింది. బీఫ్, ఫోర్క్ ఫెస్టివెల్కు వర్సిటీలో అనుమతి లేదని ఓయు కూడా చెప్పింది.
హైకోర్టు తీర్పును స్వాగతించిన రాజాసింగ్ లోథ్
ఓయూలో విద్యార్థులు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ను నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ స్పందించారు. కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానన్నారు. బీఫ్ ఫెస్టివల్ పైన కోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు.
రేపు ఉదయం 8 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ లో నిర్వహిస్తున్న గోపూజ కార్యక్రమానికి స్వామి పరిపూర్ణానంద హాజరవుతారని చెప్పారు. బీఫ్ ఫెస్టివల్ జరిపితే అడ్డుకుంటామని రాజాసింగ్ ఉద్ఘాటించారు. గత కొన్నిరోజుల నుంచి ఎమ్మెల్యే బీఫ్ ఫెస్టివల్ను వ్యతిరేకిస్తున్నారు.