ఏ ఆధారాలతో రేవంత్ అరెస్ట్, బంద్ తప్పేంటి: ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం, విడుదలచేయండి.. డీజీపీకి సీఈవో
హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆచూకీపై వేసిన పిటిషన్ మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. రేవంత్ ఆచూకీ పైన వివరాలు ఇవ్వాలని వికారాబాద్ ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పది నిమిషాల పాటు విచారణను వాయిదా వేసింది.
రేవంత్రెడ్డి అరెస్ట్పై హైకోర్టులో పిటిషన్, కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా:జైపాల్
రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో ప్రభుత్వం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను అరెస్టు చేయలేదని, అదుపులోకి తీసుకున్నామని సీపీ న్యాయస్థానానికి తెలిపారు. అయితే నివేదిక కాపీనీ కోర్టుకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విచారణను నాలుగున్నర గంటలకు వాయిదా వేశారు.
ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు
రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ కావడంతో పాటు అసలు ఏ ఆధారాలతో అరెస్టు చేశారని ప్రశ్నించింది. రేవంత్ వల్ల అల్లర్లు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. దీంతో ఆ కాపీనీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
బంద్కు పిలుపునిస్తే తప్పేమిటి
రేవంత్ బంద్కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. రేవంత్ బంద్కు పిలుపునిస్తేత తప్పేమిటని ప్రశ్నించింది. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని అడిగారు. నిఘా వర్గాల సమాచారం మేరకు తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పగా.. అందుకు సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ రేవంత్ను అరెస్టు చేయకుంటే శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏ విధంగా పోలీసులు అంచనాకు వచ్చారో చెప్పాలని ప్రశ్నించింది.ఆయనను సాయంత్రం నాలుగున్నర గంటలకు విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. రేవంత్ అరెస్టుపై వేం నరేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. రేవంత్ను కనీసం పోలీసులు ఎక్కడ ఉంచారో తెలియదని, ఆయన ఎక్కడ ఉన్నా కోర్టులో హాజరుపరిచేలా చూడాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండి.. రజత్ కుమార్
మరోవైపు, రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని తెలంగాణ సీఈవో రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీని ఆదేశించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. ఓవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా, అది సాయంత్రం వాయిదా పడిన సమయంలో సీఈవో ఆదేశాలు రావడం గమనార్హం. రేవంత్ను బలవంతంగా లాక్కెళ్ళిపోయారని, ఎందుకు తీసుకు వెళ్లారో చెప్పలేదని హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
సీఈవోకు కాంగ్రెస్ విజ్ఞప్తి, విడుదల చేయాలని ఆధేశాలు
రేవంత్ రెడ్డిని మంగళవారం వేకువజామున మూడు గంటలకు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారని, ఆయన కోసం చాపర్ సిద్ధమై ఉందని, కాబట్టి వెంటనే విడుదల చేయాలని సీఈవో.. డీజీపీకి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మేరకు వినతిపత్రం ఇవ్వడంతో ఆదేశాలు జారీ చేశారు. ఓ బహిరంగ సభ ఉందని, అందులో రేవంత్ ప్రసంగించాల్సి ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలోనే విడుదలనా?
రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పలువురు అభిమానులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఈ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికి అక్కడ నిరసన తెలిపారు. కాగా, హైకోర్టు సీరియస్ నేపథ్యంలోనే విడుదలకు మొగ్గు చూపారా అనే చర్చ సాగుతోంది. హైకోర్టులో విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. అరెస్టుపై ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో విడుదల చేశామని హైకోర్టుకు చెప్పేందుకు రిలీజ్ చేస్తుండవచ్చునని భావిస్తున్నారు.