కేసీఆర్కు షాక్: ఫాస్ట్ జీవోపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్) జీవో పైన హైకోర్టు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వేర్పాటు ధోరణిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ జీవో ఉందని పేర్కొంది. ఈ విధానం వల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడకు రాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఒడిశాలాంటి పేద విద్యార్థులకు ఈ విధానం సహకరించదని కోర్టు తెలిపింది. ఫాస్ట్ జీవో పైన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఐదుగురు సభ్యులతో దీని పైన కమిటీని ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపింది. కేవలం మార్గదర్శకాలు రూపొందించడం కోసమే అధికారాలు ఇవ్వడం జరిగిందని, జీవోపై పూర్తి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. కాగా, దీని పైన విచారణను సంక్రాంతి తదుపరికి వాయిదా వేసింది.
ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: ఎర్రబెల్లి
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ కోసం పోరాడిన వారికి మంత్రి పదవులు వద్దా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా ప్రశ్నించారు.
జూరాల, పాకాలల పైన తెరాస ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వానికి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసినట్లు నిరూపించాలన్నారు.