తెలంగాణ సర్కార్ కు కోర్ట్ ఝలక్..! మాజీ స్పీకర్ కు మరోసారీ నోటీసులు..!!
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో ఊహించని విజయం దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు పెద్ద షాక్ తగిలింది. ఇక ముగిసిపోయింది అనుకున్న పాత కేసులో హైకోర్టు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. గత ప్రభుత్వ శాసన సభ లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా విపక్ష కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే...! ఆ కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి నిరంజన్ రావులను ఏకంగా జ్యూడిషియల్ కస్టడీకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
ఒక వేళ వారు కోరుకుంటే, 10 వేల రూపాయల జరిమానాతో బెయిలు ఇవ్వొచ్చని సూచించింది. కోర్టు ఇంత సీరియస్ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ ఇచ్చిన కోర్టు ఆదేశాలు దిక్కరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ధిక్కరణ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని అసెంబ్లీ కార్యదర్శికి, హోంశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో వారిని కోర్టులో హాజరు పరచాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని కోర్టుకు తీసుకురాగా కోర్టు ఊహించని ట్విస్ట్ ఇస్తూ వారిని కస్టడీకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిది. ఇది కేసీఆర్ సర్కారుకు తీవ్ర విఘాతం కిందే లెక్క. అంతేకాదు, మాజీ స్పీకర్ మధుసుదనా చారికి మరోసారి కోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ విషయంలో చరిత్రలో ఇంత పెద్ద తీర్పులు ఇవ్వడం ఇదే ప్రథమం అంటున్నారు న్యాయ నిపుణులు.