కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు: ప్రభుత్వంపై హైకోర్టు అసహనం
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వం రద్దు వ్యవహరంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రమాణ పత్రం సమర్పించేందుకు ప్రభుత్వం మళ్ళీ గడువును కోరడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
సంతకాలు కావాల్సి ఉన్నందున సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరడంపై అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోరారు. ఇప్పటికే రెండుసార్లు సమయం ఇచ్చామని ఇక ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
చట్టానికి లోబడి నిర్ణయాలు తీసుకొంటుందని కోర్టు ప్రకటించింది. ఆ నిర్ణయాలు ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
అసెంబ్లీ సీసీపుటేజీ కోసం అసెంబ్లీ తీర్మానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను ప్రభుత్వం తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నానని, అసెంబ్లీతో తనకు సంబంధం లేదని అదనపు అడ్వకేట్ జనరల్ చెప్పారు.
అసెంబ్లీకి ప్రాతినిథ్యం పహించకపోతే ఎందుకు వీడియో పుటేజీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. అయితే కోర్టుకు వీడియో పుటేజీని ఇస్తామని అప్పటి అడ్వకేట్ జనరల్ హమీ ఇచ్చారని కోర్టు గుర్తు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తాము వ్యవహరిస్తామని ప్రకటించింది.
ఏప్రిల్ 6వ తేదిలోపుగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు డిమాండ్ చేసింది. ఈ నెల 9న వాదనలు విన్పించాలని ఆదేశించింది. ఒక వేళ కౌంటర్ దాఖలు చేయకపోతే కౌంటర్ లేనట్టుగానే భావిస్తామని కోర్టు ప్రకటించింది.