ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణా స్పీకర్ కు సీఎల్పీ విలీనంపై హైకోర్టు షాక్ ... నోటీసులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం హైకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పట్టారు. అంతేకాదు సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్ కు లేఖ సమర్పించడంతో సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. అయితే ఈ విలీనం చెల్లదని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కోర్టు మెట్లెక్కింది . దీంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
సంచలన వ్యాఖ్యలతో ఆక్రోశం వెళ్ళగక్కిన వీహెచ్ .. అసలు ఆయన బాధ ఏమిటంటే
టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం చెల్లదని కోర్టుకెళ్ళిన కాంగ్రెస్ నేతలు
టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేస్తారా అని విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాదు పార్టీ నుండి గెలిచి నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత వారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కారని, అలాంటి వారు సీఎల్పీ ని విలీనం చేయాలని కోరితే స్పీకర్ ఎలా విలీనం చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, స్పీకర్ కు కోర్టు నోటీసులు .. వివరణ ఇవ్వాలని ఆదేశం
టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనానికి సంబంధించి గతంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క కోర్టును ఆశ్రయించారు. అలాగే శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అప్పట్లో షబ్బీర్ అలీ సైతం హైకోర్టును ఆశ్రయించారు.ఇక ఈ వ్యవహారంపై నేడు విచారణ జరిపిన హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ కార్యదర్శికి, ఈసీకి సైతం హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీ కి ఫిరాయించిన నేతలైన సుధీర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్రెడ్డి, కాంతారావు,హరిప్రియ, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్దన్రెడ్డి, సురేందర్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అయితే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలకు నోటీసులు జారీ చేయలేదు. ఎందుకంటే ఇటీవలే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ పిటీషన్ వేసే సమయానికి వారు కాంగ్రెస్ లోనే ఉన్నారు . ఇక విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అంతే కాదు ఈ నాలుగు రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్, నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాలని పేర్కొంది.
రేపు భట్టీ పిటీషన్ విచారణ .. హైకోర్టు నిర్ణయం ఏంటో ?
ఇకపోతే సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క వేసిన పిటీషన్ పై రేపు బుధవారం వాదనలు వినిపించనున్నాయి. సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సైతం సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ మల్లుభట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో అటు శాసనమండలిలో సీఎల్పీ విలీనం, అసెంబ్లీలో సీఎల్పీ విలీనంపై ఆయన కోర్టును ఆశ్రయించారు.ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పిటీషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో అన్నది చూడాల్సి వుంది . ఇక నేడు హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది.