తెలంగాణా సర్కార్ కు హైకోర్టు షాక్.. సుప్రీం ఉత్తర్వులతో లింక్ ; ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లపై స్టే పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. బిఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ లపై హైకోర్టు విధించిన స్టేను యధావిధిగా కొనసాగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ , బిఆర్ఎస్ లపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ పెండింగ్లో ఉన్న కారణంగా సుప్రీం కోర్టులో విచారణ అనంతరం ఉత్తర్వులు వెలువడిన తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
Recommended Video
కొత్త ప్రాజెక్ట్ ల డీపీఆర్ లను కేంద్రానికి పంపటంపై ఏపీ, తెలంగాణా వేచి చూసే ధోరణి ... కారణం ఇదే!!
సుప్రీం తుది ఉత్తర్వులు వెలువడేవరకు బీఆర్ఎస్ , ఎల్ఆర్ఎస్ లపై స్టే కొనసాగింపు
అప్పటి వరకు బీఆర్ఎస్ , ఎల్ఆర్ఎస్ లపై స్టే యధావిధిగా కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అప్పటివరకు అర్జీ దారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని, ఎల్ఆర్ఎస్ విధానంపై సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ కాపీ లను సైతం సమర్పించాలని హైకోర్టు సూచించింది.
ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో పై ఏజీ వివరణ .. రికార్డ్ చేసిన ధర్మాసనం
ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో పై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలియజేశారు. ఏజీ ఇచ్చిన స్టేట్ మెంట్ ను సైతం రికార్డు చేసిన హైకోర్టు సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించిన తర్వాత ఈ కేసుపై విచారణ జరపనుంది. ఇప్పటికే సుప్రీం ధర్మాసనం ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ లపై మూడు రాష్ట్రాలను ఇంప్లీడ్ చేసిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ విధివిధానాలు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం లో తేలాకే నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు
ఎనిమిది వారాలలో వివరణ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశించింది . ఈ ఆదేశాలను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సుప్రీం నిర్ణయం తర్వాతే, తాము ఈ కేసులో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది హైకోర్టు ధర్మాసనం. తెలంగాణా రాష్ట్రంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకు వచ్చింది .భూముల క్రమబద్ధీకరణ కోసం అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో విపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎల్ఆర్ ఎస్ ఫీజులను తగ్గించింది.
కోర్టు నిర్ణయంతో తెలంగాణా సర్కార్ కు చుక్కెదురు
ఎల్ ఆర్ ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ ముందు నిలిపి వేసిన ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత తిరిగి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతినిచ్చింది. ఇక తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ఈ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు ఈ కేసును విచారిస్తోంది. హైకోర్టు తాజా నిర్ణయంతో మరోమారు తెలంగాణా సర్కార్ కు చుక్కెదురైంది .