కోర్టు ధిక్కరణ వ్యాజ్యం: కోమటిరెడ్డి, సంపత్ల పిటిషన్ పైన హైకోర్టు స్టే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. శాసనసభలో నియమాలను ఉల్లంఘించారని వారిద్దరిపై గత అసెంబ్లీలో స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ సాగుతోంది.
వారు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు స్టే విధించింది. సింగిల్ జడ్జి విచారణను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అసెంబ్లీలో నియమాలను ఉల్లంఘించారంటూ కోమటిరెడ్డి, సంపత్పై స్పీకర్ అనర్హత వేటు వేయడంపై వారు.. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.వారిపై అనర్హత ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందంటూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.