ఫోన్ ట్యాపింగ్లో షాక్: మాకూ ఇవ్వండి, ఇప్పుడే వద్దని హైకోర్టు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో గురువారం నాడు ఇరువైపుల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. కాల్ డేటా ఇవ్వాలని, అయితే అప్పుడే ఓపెన్ చేయవద్దని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు అందే వరకు ఎవరు సీల్డ్ కవర్ ఓపెన్ చేయకూడదని చెప్పింది.
ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటాను రిజిస్ట్రార్కు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
ప్రత్యేక సీల్టు కవరులో కాల్ డేటాను విజయవాడ కోర్టుకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఓ మెసెంజర్ ద్వారా హైకోర్టుకు కూడా వాటిని అందచేయాలని ఆదేశించింది. తాము ఆదేశించే వరకు ప్రత్యేక సీల్డ్ కవర్ ఓపెన్ చేయకూడదని ఆదేశించింది.
కాగా, తెలంగాణ తరఫున రామ్ జెత్మలానీ వాదనలు వినిపిస్తున్నారు. కాల్ డేటా ఇవ్వాలని చెప్పే హక్కు బెజవాడ న్యాయస్థానానికి లేదని ఆయన వాదనలు వినిపించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఫోన్ ట్యాప్ చేసే హక్కుందని జెత్మలానీ చెప్పారు. టిడిపి నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు టి సర్కార్ చెప్పిందని, ఓటుకు నోటు కేసు నమోదైన తర్వాతే ట్యాప్ చేసిందని జెత్మలానీ అన్నారు. సర్వీస్ ప్రొవైడర్లకు హోంశాఖ కార్యదర్శి నుంచి లేఖలు రాశామని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ అన్నారు. దేశభద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు, అసాంఘీక శక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చునని చెప్పారు. దీనికి రాష్ట్ర, కేంద్ర హోంశాఖల అనుమతి అవసరమన్నారు. రాజకీయ నాయకులు, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా ట్యాపింగ్ సరికాదన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి.